చెగువేరా జీవితాన్ని మలుపు తిప్పిన ఘటనలు..
సేవా భావంతో ఇంజినీరింగ్ వదలి మెడిసిన్..
పెట్టుబడిదారీ వ్యవస్థపై అలుపెరుగని పోరాటం..
ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న ఆకలి, నిరక్షరాస్యత, అనారోగ్యం తదితర సమస్యలను రూపుమాపాలను ఆ యోధుడు ప్రయత్నించాడు. కడుపు నింపుకోవటం కోసం పని చేసే పరిస్థితి నుండి ప్రపంచాన్ని మరింత మెరుగుపర్చటం కోసం పని చేసే పరిస్థితి కల్పించాలని కలలు గన్నాడు....ప్రపంచ యువతకు స్ఫూర్తిదాతగా నిలిచిన ఆ మహనీయుడు మరెవవో కాదు.... చెగువేరా.... అదే అందరూ ఆప్యాయంగా పిలిచే... చే...
రండి, ఆయన జీవితంలోని ప్రముఖ ఘట్టాలను తెలుసుకుని స్ఫూర్తి పొందుదాం....
అర్జెంటీనాలోని రోసారియోలో ఐరిష్-స్పానిష్ మూలాలున్న కుటుంబంలో 1928, జూన్ 14న జన్మించిన చేగువేరా చిన్నతనం నుంచీ చురుకుగా వుండేవాడు. అస్తమాతో బాధపడుతున్నప్పటికీ చదువులో, ఆటపాటల్లో ముందుండే వాడు. పన్నెండేళ్ళ వయసులోనే చెస్ ఆటలో ప్రావీణ్యం సాధించాడు. ఈత, గోల్ఫ్, సాకర్, షూటింగ్ ఆటల్లో అలవికాని ఆనందం అనుభవించేవాడు. ముఖ్యంగా మంచి సైక్లిస్టు. సైకిల్ తొక్కుతూ మైళ్ళదూరం వెళ్ళేవాడు. రగ్బీ ఆటలో ప్రావీణ్యం గొప్ప పేరు తెచ్చి పెట్టింది. భయమన్నది ఎరుగని బాల్యం అతనిది. దేనికీ వెరవనితనం చిన్నప్పుడే చెగువేరాకు అలవడింది.
ఆటల్లోనే కాదు చదువుపైనా చెగువేరాకు అమితమైన ఆసక్తి. పాఠశాల దశలోనే రాజనీతిశాస్త్రం, సమాజశాస్త్రం, చరిత్ర, పురాతత్వశాస్త్రం, తత్వశాస్త్రం, గణితం, ఇంజనీరింగ్ వంటివి చే అభిమాన అంశాలు. చిన్నతనంలోనే గొప్ప సాహిత్యాన్ని, తాత్విక గ్రంథాల్ని చదివాడు. లాటిన్ అమెరికన్ రచయితలు సృజించిన సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. బుద్ధుడు, అరిస్టాటిల్, నీషే, జాక్లండన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, బెట్రెండ్ రస్సెల్ భావాలు కౌమారంలోనే చేని అమితంగా ఆకర్షించాయి.
చే తన చుట్టూ ఉన్న సమాజాన్ని, పేదప్రజల జీవనరీతుల్ని అసంకల్పితంగానే గమనించాడు. తన ఇంట్లో ఆతిథ్యం తీసుకునే ఐరిష్ రిపబ్లికన్ పోరాటయోధుల సంభాషణలు 'చే' ని ఆకట్టుకున్నాయి. స్వేచ్ఛా సమానత్వాల కోసం ప్రాణాల్ని పణంగా పెట్టే విప్లవకారుల జీవనసరళి చే పై ఎంతో ప్రభావం చూపాయి. ఈ కారణంగానే అతనిలో సేవాభావ దృక్ఫధం కలిగింది. అందుకే తాను తొలుత ఇష్టపడిన ఇంజనీరింగ్ కోర్సును వదిలేసి మెడిసిన్లో చేరాడు. వైద్యవిద్య ద్వారా ఎక్కువమందికి సహాయపడవచ్చన్న ఆలోచనే దీనికి మూలం. యవ్వనప్రాయంలోనే ప్రజల పట్ల చే కనబరచిన మమతకు ఇది ఒక సంకేతం.
వైద్యవిద్యార్థిగా ఉన్న సమయంలో తన మిత్రుడు అల్బర్ట్ గ్రనాడోతో కలిసి చేగువేరా మోటారు సైకిల్ మీద దక్షిణామెరికా ఖండంలోని దేశాలన్నిటిని చుట్టివచ్చాడు. ఆయా దేశాలలోని పేదరికం చేని కలచి వేసింది. భూస్వాముల, ధనికరైతుల దోపిడి పట్ల ఆగ్రహం కలిగింది. తన ప్రయాణంలో భాగంగా అమెజాన్ నదీ సమీపాన గల కుష్టువ్యాధిగ్రస్తుల కేంద్రంలో కొన్నాళ్ళు సేవ చేశాడు. దాదాపు ఏడాది పాటు చేసిన ఈ యాత్రల అనంతరం తిరిగి అర్జెంటీనాకు వచ్చాడు. అక్కడ బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయంలో మెడికల్ డిగ్రీ పూర్తి చేసి డాక్టర్ ఎర్నెస్టో చేగువేరాగా మారాడు. కానీ వృత్తిపరమైన వైద్యునిగా కన్నా ప్రజల జీవితాల్ని మార్చగల సామాజిక వైద్యునిగా అతని జీవనయానం మలుపు తిరిగింది.
పెట్టుబడిదారీ వర్గపు దోపిడి కోరలకు చిక్కి శల్యమైన పేదల దైన్యం చూసి చలించిపోయాడు చే. వారి పేదరికానికి గల మూలాల్ని గ్రహించాడు. అమానుషమైన పెట్టుబడిదారీ వ్యవస్థ దౌష్ట్యం సమసిపోనిదే వారి బతుకు మారదని గ్రహించాడు. ఈ క్రమంలోనే కమ్యూనిస్టుగా, విప్లవకారునిగా, గెరిల్లా పోరాటయోధునిగా పదునుదేరాడు. అర్జెంటీనా నుంచి వెళ్ళి క్యూబన్ విప్లవ పోరాటంలో పాల్గొన్నాడు. ఫిడేల్ క్యాస్ట్రోతో కలిసి క్యూబా విప్లవం విజయం సాధించడానికి తగిన వ్యూహరచన చేశాడు. క్యూబాలో అమెరికా తొత్తు అయిన బటిస్టా ప్రభుత్వాన్ని పడదోయడంలో చూపిన పోరాటపటిమ క్యాస్ట్రోని ఆకర్షించింది. కనుక చేకి క్యూబా పౌరసత్వాన్ని ఇచ్చారు. అంతేగాక విప్లవ విజయానంతర క్యూబా నిర్మాణంలో చే కీలక భాగస్వామి. క్యూబా ప్రతినిధిగా చే దేశదేశాలు తిరిగాడు.
శత్రుదేశాల సైన్యాలు వందల సంఖ్యలో ఉన్నప్పటికీ వారిని ముప్పుతిప్పలు పెట్టి చెల్లాచెదురు చేయగల వ్యూహమే గెరిల్లా యుద్ధతంత్రం. దీనిలో చేగువేరా చూపిన నైపుణ్యమే గొప్ప ఆకర్షణ. కమాండర్గా ఆదేశాలు ఇవ్వడం వరకే చే పరిమితం కాలేదు. స్వయంగా యుద్ధభూమిలో తాను ముందుండి గెరిల్లా దళాల్ని నడిపించడం అతని ప్రత్యేకత. పోరాటంలో గాయపడినా గుండె చెదరని వీరుడు. ఈ గెరిల్లా యుద్ధ వ్యూహంతోనే నియంతల ఏలుబడిలో ఉన్న దేశాల విముక్తి కోసం విప్లవించాలని తపించాడు. క్యూబా విప్లవ విజయం, పునర్నిర్మాణంతోనే సంతృప్తి చెందలేదు. కాంగో, బొలీవియాల విముక్తి కోసం ఉపక్రమించాడు.
కాంగోలో సైనిక నియంతల పాలన అంతానికి చే సిద్ధమయ్యాడు. అక్కడ సాయుధపోరాటంలో పాల్గొనడానికి కొంతమంది విప్లవకారులతో కలిసి వెళ్ళాడు. కానీ కాంగోలో ఈ విప్లవ వీరుల ప్రయత్నాలు అనుకున్నట్లుగా ఫలించలేదు. శత్రుసైనికుల చేత చిక్కి అనేకమంది మరణించారు. ఈ కారణంగా మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చాడు చే. అయితే ఆ తరువాత బొలీవియా విముక్తి పోరాటంలో పాల్గొనడం కోసం పయనమయ్యాడు. అప్పటికే బొలీవియా సైన్యానికి అమెరికన్ సిఐఏ దళాలు అన్నిరకాలుగా శిక్షణ ఇచ్చిన అమెరికన్ సీఐఏ దళాలు చేను అంతమొందించడం ద్వారానే తాము విజయం సాధించగలమని భావించాయి. చే లక్ష్యంగా వ్యూహాలు పన్నాయి.
ప్రపంచంలో నూతన తరహా మానవాళిని సృష్టించాలన్నది చెగువేరా కల. దురాశ, స్పర్ధ, కులం, లైంగిక సంబంధాలు, జాతుల్లో ఇమిడి ఉన్న నిచ్చెనమెట్ల వ్యవస్థ వంటి అనేక దుర్లక్షణాలను తొలగించి నూతన మానవాళిని తయారు చేయటమే సోషలిజం లక్ష్యమన్నది ఆయన అవగాహన. కేవలం ప్రజలకు మౌలిక భౌతిక అవసరాలు, అవకాశాలు కల్పించటమే మన లక్ష్యంగా మిగిలిపోకూడదని ఆయన చెప్పేవారు.
1967 అక్టోబర్ 6న తనను చుట్టుముట్టిన బొలీవియా సైనిక దళాలకు చెగువేరా బందీగా చిక్కాడు. అయినప్పటికీ చివరిక్షణం వరకు సూటిగా, ధైర్యంగా, శత్రువుల కళ్ళలోకి చూస్తూ మాట్లాడాడు. అక్టోబర్ 9న బొలీవియా సైన్యాలు చెగువేరాని కాల్చి చంపాయి. శత్రువుల చేత చిక్కినప్పటికీ "తనను చంపగలరేమోగానీ, తన ఆశయాల్ని చంపలేరని" నినాదం చేసిన విప్లవయోధుడు చే. బొలీవియాలో చెగువేరా రూపొందించిన గెరిల్లా యుద్ధ తంత్రం ఫలించలేదు. సాధారణంగా అయితే ఏ దేశంలోనైనా తిరుగుబాటు చేస్తున్న వారిని బంధిస్తే విచారణ జరిపి శిక్ష వేస్తారు. కానీ చెగువేరా విషయంలో మాత్రం దీనికి భిన్నంగా అక్కడికక్కడే చంపేశారు. కనీసం శవాన్ని ఎక్కడ పూడ్చారో కూడా ప్రకటించలేదు.
నల్ల సూరీడు నెల్సన్ మండేలా క్యూబా ఇచ్చిన పురస్కారాన్ని అందుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన "చే" గురించి ఇలా అన్నారు....ప్రపంచపు నలుమూలల్లో ఏ జైళ్లు, ఏ సెన్సార్ షిప్ లకూ చెగువేరాని మన నుండి దాచిపెట్టడానికి సాధ్యం కాదు. నిజానికి ఆయనను దాచడం ఎవరి వల్ల కాలేదు. సాధ్యం కాదు కూడా. ఇది నిరంతర సత్యం. అలా ప్రతిసారి, ప్రతి రోజు రుజువవుతూనే ఉంది. ప్రపంచపు గుండెలమీద వేలాడే ప్రేమ సంతకం 'చే'...అని కొనియాడారు.
1959లో చెగువేరా తొలిసారి భారతదేశాన్ని సందర్శించినప్పుడు కొన్ని ప్రాంతాలలో పర్యటించాడు. అనంతరం నెహ్రూతో జరిగిన భేటీలో ఇంత విశాలమైన దేశంలో ప్రజానుకూల ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని ఎలా నిర్మించాలనుకుంటున్నారు, ఏ తరహా వైద్య వ్యవస్థను నిర్మించదలిచారు... ఆకలిని ఎలా నిర్మూలించాలనకుంటున్నారు అని ప్రశ్నించాడు.
'చె' బతికింది కేవలం 39 సంవత్సరాలే. కానీ ప్రపంచ యువత గుండెల్లో శాశ్వతస్థానం సంపాదించారు. ఆయన వ్యాస సంకలనం పుస్తకంగా విడుదలయ్యింది. ఏకకాలంలో, 20 భాషల్లో, దేశ దేశాల్లో ఆవిష్కరించారు. 53 ఏళ్ల కింద మరణించిన చెగువేరా, నేటికీ యువతకు స్ఫూర్తి ప్రదాతగానే వెలుగొందుతున్నాడు. ఆనాటి 'చె' ఆలోచనలూ, ఆచరణా.. నేటికీ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అందుకే నాటి యోధుడు చెగువేరా ఈనాటికీ ప్రపంచయువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చెగువేరా భావజాలానికి ఆకర్షితుడయ్యారు.. ఇలాంటి విప్లవకారుల జీవితం తెలుసుకున్నప్పుడు మన రక్తం కూడా మరుగుతుంది, అవినీతిపై తిరుగుబాటు చెయ్యాలనే ఆవేశం కలుగుతుంది.. కానీ మనం చెగువేరా కాదు కదా, అందుకే మన రక్తం రెండ్రోజుల్లో చల్లారుతుంది.. ఏమంటారు?
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments