వీలునామా అంటే ఏమిటి?
ఎందుకు రాయాలి?
ఎలా రాయాలి?
ఆస్తుల పంపకాలు అనే మాటవినగానే మనకు వీలునామా అనే పదం గుర్తుకొస్తుంది. అప్పుడు వీలునామా అంటే ఏమిటి? అనే సందేహం మనలో కలుగుతుంది. ఇంతకీ వీలునామా ఎందుకు రాస్తారు? వీలునామా రాయడం తప్పనిసరా? వీలునామాలో ఏమి రాస్తారు? అనే సవాలక్ష ప్రశ్నలు మనల్ని వెంటాడుతాయి. వాటన్నిటికీ సమగ్ర సమాధానాలందించేదే ఈ వీడియో... మరెందుకాలస్యం... వీలునామా వివరాల్లోకి వెళిపోదాం రండి!
ఒక వ్యక్తి మరణం తరువాత తన స్థిర, చరాస్తులు ఎవరికి చెందాలో, ఎలా పంపకాలు జరగాలో తెలియజెప్పే చట్టబద్దమైన ప్రకటనగల డాక్యుమెంటే వీలునామా. ఆ వ్యక్తి మరణానంతరమే అది అమల్లోకి వస్తుంది. మైనర్ కాకుండా స్థిరచిత్తం కలిగిన ఎవరైనా వీలునామా రాయవచ్చు. తన ఆస్తిని వీలునామా ద్వారా కుటుంబసభ్యులకు అప్ప జెప్పవచ్చు. చెవిటి, మూగ, అంధత్వం కలిగిన వ్యక్తులు సైతం వీలునామా రాయవచ్చు. అయితే వారికి తాము ఏం చెబుతున్నామన్న విషయం తెలుసుండాలి. మతి స్థితిమితం లేని వ్యక్తి అయినా.. ఆరోగ్యంగా ఉన్న కాలంలో రాయవచ్చు. మత్తులో ఉన్న సమయంలోనూ, తీవ్ర అనారోగ్యంగా ఉన్నపుడు, తాను ఏం చేస్తున్నానన్న దానిపై స్పృహ లేని వ్యక్తులు వీలునామా రాయడానికి అవకాశం లేదు.
వీలునామా పత్రంలో ముఖ్యంగా మూడు అంశాలు ఉండాలి. మొదటిది రాతపూర్వకంగానే జరగాలి. వీలునామా రాసిన వ్యక్తి, ఇద్దరు సాక్ష్యుల సంతకం తీసుకోవడం తప్పనిసరి. వీలునామా రాతపూర్వకంగా ఉండాలి. వీలునామా తప్పనిసరిగా తెల్లకాగితంపైనే ఉండాలి. ఇక పశ్చిమ దేశాల్లో వీడియో టేపులు, ఆడియోల ద్వారా సైతం వీలునామాను రాస్తున్నారు. వాటికి అక్కడ గుర్తింపు కూడా ఉంది. మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. వీలునామా పత్రంపై అది రాయించిన వ్యక్తి సంతకంగానీ, వేలిముద్రగానీ తప్పనిసరిగా ఉండాలి. ఒక వేళ అతను సంతకం, వేలి ముద్ర వేయలేని స్థితిలో ఉంటే అతని సమక్షంలోనే మరొకరు సంతకం పెట్టాల్సివుంటుంది.
ప్రతీ వీలునామాకు తప్పనిసరిగా ఇద్దరు సాక్షులు సంతకాలు చేయాలి. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఒకేసారి చేయాలన్న నియమం లేదు. కానీ వీలునామా రాసిన వ్యక్తి వారి సమక్షంలో ఒప్పందాన్ని ఒప్పుకుని ఉండాలి. ఈ సాక్షులిద్దరూ కూడా వీలునామా కర్త సమక్షంలోనే సంతకాలు చేయాలి. 18 ఏళ్లు నిండిన వారెవరైనా సాక్షి సంతకాలు చేయవచ్చు. అయితే ఆ వీలునామా ద్వారా లబ్ది పొందే వ్యక్తులు సాక్షి సంతకాలు చేయకూడదు. సాక్షులకు వీలునామాలోని అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు. ఎవరైనా వ్యక్తిని మోసంతోనూ, ఒత్తిడి చేసి వీలునామా రాయించినపుడు అది ఎంతమాత్రం చెల్లదు. ఉదాహరణకు వీలునామాకర్తను చంపుతామని బెదిరించినపుడు, అతని పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తామని ఒత్తిడి తెచ్చినపుడు, అతని కుమారుడు తప్పుడుపని చేశాడని... అది బయటకు తెలియపర్చకుండా ఉండాలంటే వీలునామా రాయాలని.. బెదిరించి, భయపెట్టి రాయించిన పక్షంలో అవి చెల్లవు.
వీలునామా భాష చాలా సరళంగా, స్పష్టంగా, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఉండాలి. టెక్నికల్, లీగల్ పరిభాషలోనే ఉండాలని ఎక్కడా లేదు. కానీ వీలునామా చదవగానే కర్త ఉద్దేశం స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలి. వీలునామాలో అన్ని విషయాలు స్పష్టంగా ఉండాలి. అలాగే అస్తిలో ఎలాంటి హక్కులు అతనికి ధారాదత్తం చేస్తున్నారో వివరించాలి. ఆ ఆస్తి అతనికి ఎప్పటినుంచి చెందాలో అంటే... మైనారిటీ తీరిన తరువాతనా లేక వివాహం అయిన తరువాతనా? అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి.
సొంత ఆస్తిని తన తదనంతరం ఎవరికి చెందాలనేదానిపై చట్టబద్ధత కల్పిస్తూ రాసే దస్త్రాన్నే వీలునామా అంటారు. వీలునామా రాసే వ్యక్తి తన జీవితంలో ఎప్పుడైనా అందులో మార్పులుచేర్పులు చేసుకునే హక్కుంది. రిజిస్టర్ చేసిన వీలునామాను మాత్రం మార్చాలంటే తిరిగి రిజిస్టర్ చేసుకుంటేనే చెల్లుతుంది. స్థిరాస్తి బదిలీ కోసం ఉద్దేశించిన వీలునామాకు స్టాంప్ డ్యూటీ అక్కర్లేదు. తల్లిదండ్రులను పిల్లలు బాగా చూసుకుంటారనే నమ్మకం ఉంటే... కోర్టులో వారసత్వ ఆస్తి గురించి ఇప్పుడు ఇన్ని కేసులు ఉండేవి కాదు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే వీలునామా రాసి, దాన్ని రిజిస్టర్ చేసుకోవడం మంచిది. వ్యక్తి మరణించిన అనంతరం నకిలీ ధ్రుపత్రాలు, తప్పుడు సంతకాలతో ఆస్తిని కాజేయాలని చూసే వారికి వీలునామానే తగిన సమాధానంగా నిలుస్తుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీలునామా రాయడం మంచిదంటారు. ఏదైనా ఆస్తి కొనుగోలు చేసిన సందర్భంలోనే వీలునామా రాయడం మంచిదంటారు. చావు చెప్పి రాదంటారు...కనుకనే వీలునామా రాసేందుకు ఇదే ప్రత్యేక సమయం అంటూ ఏమీ ఉండదు. అయితే నామినీలు మాత్రమే చట్టబద్ధ వారసులకు లేదా లబ్ధిదారులకు నమ్మకంగా ఆస్తిని బదిలీ చేయగలిగే అవకాశం ఉంటుంది
స్థిరాస్తికి నామినీలంటూ ఉండరు. కాబట్టి ఇలాంటి వాటికి తప్పనిసరిగా వీలునామా రాయాల్సి ఉంటుంది. వీలునామా రాసే వ్యక్తి చట్టబద్ధ వారసుల పేరు, వివరాలు తెలపాలి. తల్లి, భార్య లేదా భర్త, కూతురు, కొడుకు ఇలా అన్నమాట...... అయితే కుటుంబంలో కనీసం ఒక్క వ్యక్తికయినా వీలునామాను ఎక్కడ భద్రపరిచిందీ తెలియజేయాలి. వీలునామాలో ఏం రాయవచ్చంటే... సొంతంగా సంపాదించుకున్న స్థిర, చరాస్థులకు సంబంధించి ఏవైనా వీలునామాలో రాయవచ్చు. ఏదైనా ఆస్తి నేరుగా తండ్రి, తాత, ముత్తాతల నుంచి సంక్రమిస్తే దాన్ని సొంతంగా సంపాదించిన దాంతో సమానంగా చూస్తారు. కాబట్టి దీనిని వీలునామాలో జతచేయవచ్చు. స్థిరాస్తికి సంబంధించిన పూర్తి వివరాలు వీలునామాలో రాయాల్సి ఉంటుంది. ఆస్తిలో ఎంత వాటా మొత్తం... అది ఉన్న వీధి, ఇంటి నెంబరు, ప్రాంతం, నగరం, ఎవరి దగ్గర నుంచి కొన్నారన్న విషయాలను తప్పక నమోదు చేయాలి. తద్వారా సందిగ్ధతలకు తావివ్వకుండా చేయవచ్చు. సాధారణంగా ఆస్తిని భార్య పేరిట రాస్తారు. ఆమె తదనంతరం పిల్లలకు చెందేలా రాస్తారు. భార్యకు పూర్తి ఆస్తిని అమ్ముకునే హక్కును ఆపాదిస్తూ కూడా వీలునామా రాయవచ్చు.
ఉదాహరణకు ఈ నమూనా వీలునామా చూస్తే… "నేను కొన్న ఇంట్లో నా భార్య ఉండేందుకు హక్కు ఉంది" అని ఒక వ్యక్తి వీలునామా రాసి పోయాడనుకుందాం. ఆ తర్వాత ఆమె ఎక్కడ ఉందో ఊహించగలరా?.... ఆమె తన చరమ దశలో కారు షెడ్డులో జీవితం గడపాల్సి వచ్చింది. అయితే మరణించకముందు ఆ వ్యక్తి ఆ వీలునామాలో... ‘‘నేను ఉన్నప్పుడు ఏ విధంగా అయితే బెడ్రూమ్, డ్రాయింగ్ రూమ్, కిచెన్, లాబీ, గార్డెన్ వాడుతూ కలియతిరుగుతూ ఉన్నానో నా తదనంతరం కూడా నా భార్యకు నా ఇంట్లో ఈ చోట్లలో తిరిగాడే, జీవించే హక్కు ఉంది... అని రాసి ఉంటే ఈ పరిస్థితి వేరుగా ఉండేది. అందుకే వీలునామాలో ప్రతి చిన్న విషయాన్ని స్పష్టంగా రాయడం మంచిదంటారు. వీలునామాను సవరణ చేయవచ్చు. వీలునామా ఒకసారి రాసి వదిలేసిది కాదు. కుటుంబంలో పరిస్థితులు మారినా... అంటే కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు చనిపోయినా, కొత్త ఇల్లు, షాప్ కొనుగోలుచేసినా, వ్యాపారం ప్రారంభించినా కొత్త వీలునామా రాయడం మంచిది. లేదా అందులోనే తగిన మార్పులు చేయాల్సివుంటుంది. వీలునామాను ఎన్నిసార్లయినా సవరించుకోవచ్చు.
వీలునామాను రిజిస్ట్రేషన్ చేయించాలి. అలా రిజిస్టర్ చేయించకపోతే అసలైన వ్యక్తే వీలునామా రాశాడా? అనే సందేహం కలుగుతుంది. రిజిస్టర్ అయిన వీలునామాకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రిజిస్ట్రేషన్కు నామమాత్రపు ఛార్జీ ఉంటుంది. వీలునామాను టైప్ చేయించి, ఒరిజినల్వి రెండు కాపీలు సిద్ధం చేసుకోవాలి. దీనిపై కుడి వైపున పై భాగంలో ఫొటో అతికించి, జతగా గుర్తింపు పత్రాన్ని పొందుపర్చాలి. వీలునామా ప్రతి పేజీలోనూ వీలునామా రాసిన వ్యక్తి సంతకం, ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండాలి. ఆ తర్వాతే సబ్ రిజిస్ట్రార్కు వీలునామా సమర్పించాలి. కొన్ని చోట్ల వయో వృద్దులకు ప్రాధాన్యతనిస్తారు. అలాంటి చోట్ల వీలునామా రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తవుతుంది. చాలా మంది తల్లిదండ్రులేమో ఇక్కడ ఉంటారు. వారి పిల్లలు విదేశాల్లో స్థిరపడి ఉంటారు. అటువంటప్పుడు ఆస్తిని వారి పేరిట బదిలీ చేసేందుకు వీలునామా రాయడం చాలా ముఖ్యం. దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చాలా మంచిది. వీలునామాలో పేర్కొన్న ఆస్తిని అమ్ముకొని దాని లాభాలను విదేశాలకు తరలించడానికి ప్రభుత్వం అనుమతినిస్తుంది. అయితే ఎవరైనాసరే వీలునామా రాసేముందు అనుభవం కలిగిన ఒక లాయరును సంప్రదించడం ఉత్తమం.
ఇదే విధంగా ఆన్ లైన్ వీలునామా ఎలా తయారుచేయించుకోవచ్చో వివరంగా మరో వీడియోలో చెయ్యడం జరిగింది, ఆ వీడియో కూడా మీరు వెంటనే చూడవచ్చు..
అనాథగా పెరిగా.. భర్త తోడు లేకపోయినా ధైర్యంగా నిలిచా.. స్పూర్తినిచ్చే స్థాయికి ఎదిగా..! జ్యోతి రెడ్డి రియల్ లైఫ్ స్టోరీ!! అనిల జ్యోతి రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిక...
అనసూయ భరద్వాజ్ ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. ప్రస్తుతం ఈ భామ టీవీ షోలతో పాటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 'ప్రేమించిన వాడితో పెళ్లికి.. 9 ఏళ్ళ పాటు నిరీక్షించిన అనసూయ'.. ఓ అందమైన ప్రేమ...
0 Comments