మరుగున పడిన ఆటలు
ఆడండి... ఆడించండి..
ఉల్లాసం... ఉత్సాహం... సామర్థ్యం..
ఆటలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయి. చక్కగా ఆడుకునే పిల్లలు సమగ్రంగా వికసిస్తారు. అయితే ఇప్పుడు మైదానాలన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయాయి. జామకాయల దొంగతనాలు అటకెక్కి, ఫ్రూట్సాగాలో స్క్రీన్ను టచ్ చేస్తే పండు రాలిపడుతోంది. సబ్వే సర్ఫ్లో వేలు టచ్ చేస్తే చాలు ఎక్కడ నుంచి కావాలంటే అక్కడ నుంచి దూకొచ్చు... ఇక దూకుడు లాంటి ఆటలతో పనేముంది? తాడాట, బొంగరాలు, టైర్లాటల గురించి చెప్పాల్సి పనేలేదు. ఇప్పుడు పిల్లలు శరీరానికి ఏ మాత్రం చెమట పట్టించకుండా ఫోన్లోనే బోలెడన్ని ఆటలు ఆడుకుంటున్నారు. అయితే ఎప్పటికీ మరచిపోలేని అలనాటి ఆటలు ఎంతో ముచ్చటగొలుపుతాయి. శారీరక ఆరోగ్యానికి సహకరిస్తాయి. అటవంటి ఆటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహాభారతంలో పాండవులు పాచికలు ఆడటం... మొఘలులు మధ్యాహ్నవేళ చదరంగం ఆడటం.. ఇలా మన పురాణాల్లోనూ, చరిత్రలోనూ ఆటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆరుబయట ఆటలు ఆడే పిల్లల్లో ఉల్లాసం, ఉత్సాహం, శారీరక సౌష్టవం పెరుగుతుంది. అలాగే స్నేహాలను పంచుకోవడానికి దోహదపడుతాయి. వామనగుంటలు, అష్టాచమ్మా, పచ్చీసు, గచ్చకాయలు, ఖోఖో, బిళ్లంగోడు, తాడాట, తొక్కుడు బిళ్ళ, బొమ్మా బొరుసు, కప్పగంతులు, నాలుగు స్తంభాలాట, వీరి వీరి గుమ్మడిపండు, ఏడు రాళ్ళ ఇలా ఎన్నో ఆటలు ఉన్నాయి.
వామన గుంటలు
దీర్ఘచతురస్రాకారంలో రెండు వరుసలుగా చెక్కతో చేసిన బోర్డుగేమ్ ఇది. దీనిని వామనగుంటల పీట అంటారు. దీనికి ఒకవైపు ఏడుగుంటలు, మరోవైపు ఏడు గుంటలు ఉంటాయి. దీంట్లో ఆడటానికి చింతపిక్కలు లేదా సీతాఫలం గింజలను వాడతారు. ఇద్దరు ఆడే ఈ ఆటలో ఒక్కో గుంటలో ఐదు గింజల చొప్పున వేస్తూ ఆటను మొదలుపెడతారు. ఒక గుంటలో గింజలను తీసి అన్ని గుంటలకు పంచుతూ.. గింజలన్నీ అయిపోయాక ఆ తరువాతి గుంటలో నుంచి గింజలు తీసి మిగతా గుంటల్లో వేయాలి. మధ్య ఖాళీ గుంట తటస్థపడితే ఆ తరువాత గుంటలో ఉన్న గింజలన్నీ పంచిన వ్యక్తికే చెందుతాయి. అంటే అతను అన్ని గింజలని గెలుచుకున్నట్లు. ఒకరు గింజలను పంచుతుంటే మరొకరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఎవరి దగ్గర ఎక్కువ గింజలు ఉంటే వారు ఈ ఆటను గెలిచినట్లు లెక్క. ఈ పీట అందుబాటులో లేకపోతే నేలమీద గీతలను గీసి కూడా ఆడుకోవచ్చు.
పచ్చీసు
పచ్చీసును నలుగురు ఆడతారు. ఈ ఆటలో పదహారు కాయలుంటాయి. ప్రతి ఒక్కరూ నాలుగు కాయల చొప్పున పంచుకుంటారు. ఒకొక్కరికి ఒక్కో రంగు కాయలు వస్తాయి. పచ్చీసును నేలపై సుద్దముక్కతో గీసి నలుగురు నాలుగువైపులా కూర్చుని ఆడతారు. పందెం వేయడానికి ఏడు గవ్వలను వాడతారు. గవ్వలతో దస్, తీస్, పచ్చీస్ వేసినప్పుడు పావులు వస్తాయి. పందెం గడివైపు సాగుతుంది. ముందున్నవారు తల్లి గడివైపు వెళ్ళేలోపు వట్టి చోట్ల ఉంటే వారి తరువాత వారు ముందున్న పావును చంపవచ్చు. గడిలో చేరిన పావులను చంపకూడదు. ఈ పందాల విలువ పచ్చీసు. అంటే ఇరవై అయిదు. తీస్ అంటే ముప్ఫై, దస్ అంటే పది.. ఎవరు ముందు మధ్యలో ఉన్న ఇల్లు చేరితే, చుట్టూ నాలుగు వైపులా పూర్తిచేయగలిగితే వాళ్ళు ఆటలో గెలిచినట్లు లెక్క.
అష్టాచెమ్మా
చతురస్రాకారంలో సుద్దముక్కతో గీసి ఆడే ఆట. దీన్ని ఇద్దరు నుండి నలుగురు వరకు ఆడొచ్చు. ఆడటానికి నాలుగు గవ్వలు లేదా అరగదీసిన చింతపిక్కలను వాడతారు. ఆడేటప్పుడు నాలుగు గవ్వలను ఒకేసారి నేలకు విసురుతారు. దాంట్లో కొన్ని వెల్లకిలా, మరికొన్ని బోర్లా పడతాయి. నాలుగు గవ్వలు బోర్లాపడితే దానిని అష్టా అంటారు. నాలుగు గవ్వలు వెల్లకిలా పడితే దానిని చెమ్మా అంటారు. ఒకొక్కరి దగ్గరా నాలుగు పావులు లేదా చింతపిక్కలు ఉంటాయి. ఈ పావులు ఎవరెవరివో తెలియడానికి నాలుగు భిన్నమైన రంగులను ఎంచుకుంటారు.
గచ్చకాయలు
ఐదు నున్నటి రాళ్ళు లేదా గచ్చకాయలతో ఆడుకునే ఆట ఇది. నాలుగు రాళ్ళను కింద వదిలేసి ఒక రాయిని పైకి విసురుతూ, విసిరిన రాయి కిందకి వచ్చి పట్టుకునేలోపు నేలపై నున్న రాళ్ళని తీసుకోవాలి. ఈ ఆటను ఒకరి తర్వాత ఒకరు ఆడతారు.
చదరంగం
ఇది మనదేశపు అతి ప్రాచీన ఆట. ఈ ఆట మన దేశం నుంచి దక్షిణ ఐరోపా ఖండంలో పదిహేనవ శతాబ్దంలో కాలుపెట్టి ప్రస్తుతం అనేక మార్పులకు లోనై ‘చెస్’గా రూపాంతరం చెందింది. ఇందులో 16 తెల్లపావులు, 16 నల్లపావులు ఉంటాయి. ఇవి రాజు, మంత్రి, ఏనుగులు, గుర్రాలు, సైనికులుగా.. ఒక్కోటి ఒక్కో ఆకారంలో ఉంటాయి. 64 చదరపు గళ్ళు ఉండే ఈ ఆటలో తెల్లపావులను ఒక ఆటగాడు, నల్లపావులను మరో ఆటగాడు నియంత్రిస్తుంటాడు. అనేక ఎత్తులు, యుక్తులతో ఎదుటి ఆటగాడిని చిత్తుచేయడమే దీని ప్రత్యేకత. మెదడుకు పదును పెట్టే ఆటల్లో ఇది మొదటిస్థానంలో నిలుస్తుందని చెప్పచ్చు.
బిళ్ళంగోడు
దీన్ని కొన్ని ప్రాంతాల్లో గిల్లీడండా అంటారు. మూరెడు పొడుగున్న కట్టెని గోడు అనీ, జానెడు పొడుగున్న కట్టెని బిళ్ళ అనీ అంటారు. ఈ కట్టెల్ని నున్నగా చెక్కి తయారు చేసుకుంటారు. చిన్నదైన బిళ్ళని సన్నని గుంట తీసి దానిపై అడ్డంగా ఉంచి, పెద్ద కర్రతో లేపి కొడతారు. అది వెళ్లి పడిన చోటు నుంచి గోడుతో కొలుస్తారు. ఎవరు ఎక్కువ దూరం కొడితే వారు గెలిచినట్లు లెక్క అన్నమాట.
దాగుడు మూతలు
ఇది ఏ వేళైనా, ఎక్కడైనా ఆడుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా ఈ ఆటను ఆడవచ్చు. ఒకరు కళ్లు మూసుకుని ఉంటే మిగిలినవారు దాక్కుంటారు. వారిని ఈ కళ్లు మూసుకున్న వ్యక్తి పట్టుకోవాలి. దీన్ని దొంగపోలీసు అని కూడా అంటారు.
గోళీలాట
ఈ ఆటను ఎక్కువగా అబ్బాయిలు ఆడతారు. ఇది అందరికీ తెలిసిన ఆటే అయినా ఇప్పటి పిల్లలు ఎవరూ దీన్ని ఆడటం లేదు. ఒక వృత్తాన్ని గీసి అందులో గోళీలను ఉంచుతారు. ఒక గోళీతో అందులోని గోళీలను గురిచూసి కొడతారు. తగిలిన గోళీలన్నీ కొట్టినవాడికి సొంతం. ఇలా గోళీలు పోగవడంతో పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ ఆటను ఆడతారు.
బొంగరాలు
దీనిని ఇంగ్లీషులో గేమింగ్ టాప్ అంటారు. ఈ ఆటలో ఏకాగ్రత, నైపుణ్యం, ఆసక్తి అవసరం. బొంగరానికి తాడును చుట్టేందుకు వీలుగా మెట్లుమెట్లుగా ఉండి కింద మేకు ఉంటుంది. పై భాగంలోని డోమ్ బొంగరాన్ని చేతితో పట్టుకుని విసరడానికి అనువుగా ఉంటుంది. మేకు కిందివైపు ఉండటం వల్ల బొంగరం వేగంగా, ఎక్కువసేపు తిరగడానికి అనువుగా ఉంటుంది. ఈ ఆట దాదాపు అందరికీ తెలిసిందే.. దీన్ని కొందరు చేతులపైన కూడా తిప్పుతారు.
తొక్కుడు బిళ్ళ
దీన్ని అమ్మాయిలు ఎక్కువగా ఆడతారు. ఇది ఒంటరిగా లేదా జట్లుగా ఆడవచ్చు. పక్కపక్కనే ఉన్న నాలుగు నిలువుగళ్ళు, రెండు అడ్డగళ్ళు గల దీర్ఘచతురస్రాకార గడులలో ఈ ఆటను ఆడతారు. ముందు ఒకరు బిళ్ళను ముందు గడిలో వేసి కాలు మడిచి మిగతా ఎనిమిది గడులను దాటించి బయటకు తీసుకురావాలి. తరువాత మిగిలిన గడులను దాటించాలి. ఏ సమయంలోనూ కాలుగానీ, బిళ్ళగానీ కింద పెట్టకూడదు, మధ్యలోని గడుల గీతలను తాకకూడదు. గడులన్నీ అయిపోయాక కాలి వేళ్ళమధ్య బిగించి పట్టుకున్న దాన్ని కుంటికాలితో ఎనిమిది గడులను గెంతి రావాలి. తరువాత కాలి మడమపై, తలపై, అరచేతిలో, మోచేతిపై, భుజంపై పెట్టుకుని అన్ని గడులను తిరిగి రావాలి. ఇవన్నీ దాటితే వారే గెలిచినట్లు.
నేలబండ
ఈ ఆటను ఇంతమందే ఆడాలి అని లేదు. ఎందరైనా ఆడొచ్చు. ముందు ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. దొంగని నేలకావాలో, బండ కావాలో తేల్చుకోమంటారు. దొంగ నేల కోరుకుంటే మిగిలినవారు బండపై నిలబడాలి. అప్పుడప్పుడూ నేలపైకి వచ్చి దొంగను ఆటపట్టించాలి. దొంగ బండపైకి వెళ్ళకుండా నేలపైకి వచ్చినవాళ్ళను పట్టుకోవాలి. ఎవర్ని ముందు పట్టుకుంటే వారే తరువాత దొంగ అవుతారు.
కబడ్డీ
టీవీల్లో ఖేల్ కబడ్డీ వచ్చాక అందరికీ ఈ ఆట గురించి ఎక్కువ మందికి తెలిసింది. ఒక్కో జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ఉంటారు. ఒక ఆటగాడు రెండోవైపు "కబడ్డీ కబడ్డీ.." అంటూ గుక్క తిప్పుకోకుండా వెళ్లి అవతలి జట్టువారిని టచ్ చేసి తిరిగి మధ్య గీతను ముట్టుకోవాలి. ఎంతమందిని ముట్టుకుని మధ్యగీతను ముట్టుకుంటే అంతమంది ఔట్ అయినట్లు లెక్క. తరువాత రెండోవైపు వారు కూడా ఇలా చేయాలి. ఎవరి జట్టులో వాళ్ళందరూ ముందుగా ఔట్ అయితే మరో జట్టు గెలిచినట్లు లెక్క.
ఖోఖో
ఇది సంప్రదాయక ఆట. ఈ ఆటను పన్నెండు మంది ఆడతారు. తొమ్మిదిమంది అటు, ఇటు ఒకరుగా వరుసగా కూర్చుంటారు. ఒక దొంగ ఉంటాడు. మరోవ్యక్తి నిల్చుని ఉంటాడు. దొంగ వ్యక్తి నిల్చున్న వ్యక్తిని పట్టుకోవాలి. అతను పరిగెత్తుతూ కూర్చున్న వాళ్ళని లేపి తను కూర్చుంటాడు. ఇలా ఈ ఆట సాగుతుంది.
సంప్రదాయక ఆటలు శారీరక ఎదుగుదలతో పాటు మానసిక వికాసం, సాంఘిక జీవనాన్ని అలవాటు చేస్తాయి. ఇప్పటి పిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్, సెల్ఫోన్ గేమ్స్ వల్ల వారి కంటిచూపు దెబ్బతింటుంది. మానసిక ఆందోళనలు, చికాకు ఎక్కువవుతుందని ఇటీవల పరిశోధనల్లో తేలింది. సంప్రదాయక ఆటలు ఆడుతున్న పిల్లలు చాలా చురుగ్గా ఉంటారని పలు పరిశోధనల్లో తేలింది. వీరు వివిధ అంశాలపై పట్టును సాధించగలుగుతారని, మానసిక స్థైర్యాన్ని కలిగి ఉంటారని వెల్లడయ్యింది.
మీకు తెలిసిన కొన్ని ఇలాంటి ఆటలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి..
పుల్లెల గోపీ చంద్ ..భారత బ్యాడ్మింటన్ ఆటలో మొనగాడు. ఆడటమే కాదు ఆడించడం కూడా తెలుసు.. అందుకే పీవీ సింధుని ఒలింపిక్స్ స్వర్ణం దాకా తీసుకెళ్ళి తన సత్తా ప్రపంచానికి చాటాడు.. ఈసారి పోటీల్లో స్వర్ణమే లక్ష్య...
మహేంద్రసింగ్ ధోని జీవిత విశేషాలు: రీసెంట్ గా ధోనీ తన రిటైర్ మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ధోనీ నిజ జీవితం లో ఎత్తుపల్లాలను, వ్యక్తిగత జీవిత విశేషాలను ఒకసారి తెలుసుకుందాం.. ధోనీ 1981 జూలై...
0 Comments