సరోజినీ నాయుడు గురించి తెలియని వారు భారతదేశం లో ఉండరు.. ఆమె ఒక స్వాతంత్ర సమరయోధురాలు అని ఎంతో మందికి తెలిసినప్పటికీ ఆమె జీవిత చరిత్ర తెలుసుకుంటే మనసు ఉప్పొంగడం ఖాయం.. ఒక స్త్రీ తలచుకుంటే ఇన్ని కార్యాలు చేయగలదా? అని ఆశ్చర్యపోవడం ఖాయం.. ఆమె నిజ జీవిత విశేషాలు రెండు భాగాలుగా తెలుసుకుందాం.. మొదటి భాగం లో ఆమె నేపద్యం, బాల్యం, చదువు మొదలైన అంశాలు తెలుసుకుందాం..
నైటింగేల్ ఆఫ్ ఇండియా గా ప్రసిద్ధి చెందిన ఇండియన్ లేడీ టైగర్ సరోజినీ నాయుడు. ఆమె ఫిబ్రవరి 13, 1879 న జన్మించారు.. ఆమెను భారత కోకిల గా కూడా పిలుచుకుంటారు.. సరోజినీ నాయుడు ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధురాలు, ఈమె అనేక రచనలతో అద్భుత కవయిత్రి
గా కూడా పేరు గాంచారు... సరోజినీ దేవి 1925 డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యారు.. స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు గా కూడా భాద్యతలు చేపట్టారు..
సరోజినీ నాయుడు బాల్యము ఎలా గడిచింది?
భారత దేశం బానిసత్వపు సంకెళ్ళ నుండి, నియంతృత్వ సంకెళ్ళ నుండి విముక్తి పొందాలని ఆమె కోరుకున్నారు.. దేశ ప్రజలు స్వేచ్ఛా, స్వాత్రంత్ర్యాలతో జీవించాలని కలలు గన్నారు. ఆనాడే పురుషులకు ధీటుగా స్వతంత్ర్య సమరం లో పోరాడి, భారత మహిళలు ఏ రంగంలోనూ తీసిపోరని నిరూపించిన వీర మహిళలలో సరోజినీ నాయుడు ముందువరుసలో ఉన్నారు..
సరోజినీ నాయుడు హైదరాబాదులో జన్మించారు. తండ్రి డా. అఘోరనాథ్ చటోపాద్యాయ, తల్లి శ్రీమతి వరద సుందరి. అఘోరనాథ్ హైదరాబాదు కాలేజికి, అనగా నేటి నిజాం కాలేజీ మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచీ ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు, కథలు వ్రాసేవారు.
తండ్రి గారైన అఘోరనాథ్ ఎనిమిది భాషలలో పండితుడు. సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, గ్రీకు, జర్మనీ, హిబ్రూ, ఫ్రెంచ్, ఆంగ్లం మొదలైన భాషలు ఆయనకు అనర్గళంగా వచ్చు. వీరు ఎడింబరో విశ్వవిద్యాలయంలో డాక్టరు పట్టాను పొందటం జరిగింది.
శ్రీమతి సరోజినీ నాయుడు సద్ వంశంలో జన్మించటం వలనా, తల్లి దండ్రులు విద్యాధికులవటం వలన, ఆమెలో చిన్నతనం నుంచే కార్యదీక్షా, పట్టుదలా, విద్యపై తిరుగులేని సదభిప్రాయాలు ఏర్పడటం జరిగింది. ఏది చూసినా ఎవరి మాటలు విన్నా పట్టించు కోకుండా తమ ఆలోచనల్లో తాముంటారు చాలా మంది. కొందరు ఆ విధంగా కాక బాల్యం నుండీ ప్రతి విషయం లోనూ కుతూహలం కనబరచి ఏది, ఏమిటో తెలుసుకొనే వరకూ కొందరు విశ్రమించరు . ఆ రెండవ కోవకు చెందిన మేధావి శ్రీమతి సరోజినీ నాయుడు.
చిన్నతనం నుంచీ ఆమెకు ఇంగ్లీషు భాషమీద చాలా మక్కువ ఉండేది. ఇంగ్లీషు మాట్లాడాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూండేది. ఆ పట్టుదల తోనే ఇంగ్లీషు భాషను ఎంతో శ్రద్ధగా అభ్యసించింది. పదకొండో సంవత్సరం వచ్చేసరికి ఆమె అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడి అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేసింది. ఆ వయసులోనే ఇంగ్లీషులో రచనలు ఆరంభించింది కూడా!
ఆమె పన్నెండవ ఏట మదరాసు విశ్వవిద్యాలయం మెట్రిక్యులేషన్ పూర్తి చేయగలిగిందంటే ఆమె చురుకైన తెలివితేటలూ, విద్య పై ఆమెకు గల భక్తి భావం మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది విద్యార్థులు నిత్యం పాఠశాలలకు వెళుతూ, విద్య పై దృష్టి నుంచక, గురువులు చెప్పే పాఠాలను కాలక్షేపంగా భావిస్తూ, గురువులను సాటి విద్యార్థులనూ ఆవహేళన చేస్తూ కాలం విలువ తెలియక ప్రవర్తిస్తూ ఉంటారు.. ఆ తర్వాత యవ్వన జీవితం లో అడుగు పెట్టి అనేక సమస్యల వలయం లో చిక్కుకుని వృధా చేసిన కాలం గురించి బాధపడుతుంటారు. అటువంటి వారందరికీ శ్రీమతి సరోజినీ నాయుడు నిజంగా ఆదర్శమూర్తి.
హైదరాబాదు నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషనుకు సమీపంలో వున్న ఈ చారిత్రాత్మక బంగళాలో వారి తండ్రి గారైన అఘోరనాథ్ చటోపాధ్యాయ నివాసముండేవారు. దీనిని సరోజినీ నాయుడుగారి తదనంతరం వారి ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డెన్ త్రెషోల్డ్ గా పేరు మార్చారు..
సరోజినీ పదమూడవ యేట చాలా పెద్ద సంకలనం రచించింది. దానిపేరు సరోవరరాణి (ళద్య్ ఒఫ్ ళకె).. అది పదమూడు వందల పంక్తులతో నిండిన అతి చక్కని రచన. తాను చెప్పదలచుకున్న విషయము ఇతరుల హృదయాలకు హత్తుకుని ఆలోచింపజేసే విధంగా ఆ రచన పేరుగాంచింది.. ఆమెలోని ప్రత్యేకతలు గ్రహించిన నిజాం నవాబు ఆమెను ఉన్నత చదువులకై విదేశాలకు పంపాలని నిర్ణయించుకుని ఆమెకు ప్రతి సంవత్సరం నాలుగువేల రెండు వందల రూపాయలు విద్యార్థి వేతనంగా ఇచ్చేందుకు అంగీకరించాడు. తల్లి దండ్రులు కూడా ఆమెను సంతోషంగా విదేశాలకు పంపారు. సరోజినీ లండన్ కింగ్స్ కాలేజీ లోనూ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ అధ్వర్యంలోని గిర్టన్ కాలేజిలోనూ విద్యాభ్యాసం చేశారు. సరోజినీ నాయుడు రాసిన కవితలను చదివి, ఇంగ్లాండ్ లోని ఆంగ్ల భాషా విమర్శకులు ‘ఆర్థర్ సైమన్స్’, ఎడ్వర్ గూస్ లు ఆమెను ఎంతగానో అభినందించారు. పాశ్చాత్య విద్వాంసులను చాలా మందిని కలసి వారికి గల పాండిత్యాన్ని ఆకళింపు చేసుకుని వారితో స్నేహ సంబంధాలు పెంచుకుని వారి సలహాలపై, ఇంగ్లీషులో అతి చక్కని గ్రంథాలు వ్రాసింది.
ఆమె రచించిన కావ్యాలలో కాలవిహంగం , స్వర్గ ద్వారం , విరిగిన రెక్కలు అనేవి చాలా ప్రసిద్ధమైనవి. ఆమె ఇంగ్లాండులో నివసిస్తూ రచనలు సాగించినా వాటిలో భారతీయ జీవితాలు ప్రతిబింబించేటట్లు చేయడం ఆమె ప్రత్యకత.
సరోజినీ నాయుడు వివాహము, కుటుంబ బాధ్యతల సంగతులేంటి?
1898 వ సంవత్సరం విదేశాలలో విద్య పూర్తి చేసుకుని భారతదేశం తిరిగి వచ్చాక, ఆమె శ్రీ ముత్యాల గోవిందరాజులు నాయుడు గారిని పెండ్లాడటం జరిగింది. గోవిందరాజులు అప్పటి హైదరాబాద్ ప్రధాన ఔషధారోగ్యాధికారి. కులం మతమూ అనే మూఢవిశ్వాసాలంటే ఆమెకు చిన్నతనం నుంచే అసహ్యం. ఈ కుల, మతాలనేవి జాతి, వర్గ భేదాలను సృష్టించి, ధనవంతులు, నిరుపేదలు, బలవంతులు, బలహీనులు అంటూ జాతిని వేర్పాటు ధోరణికి బలి చేస్తుందనీ, కుల మతాతీత భావాలతో పెరిగే ప్రజానీకం మాత్రమే సమ సమాజ స్థాపన చెయ్యగలరనీ ఆమె అభిప్రాయం.
ఆమె అదే అభిప్రాయంతో శ్రీ ముత్యాల గోవిందరాజులు నాయుడు తన కులము కాకపోయినా వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు దగ్గరుండి వీరి వివాహం జరిపించారు. ఆమె చేసిన పనికి ఎన్నో విమర్శలు ఎదుర్కోవలసి వచ్చినా మానవ జీవిత మనుగడకు మనసూ, మానవత్వం ముఖ్యం కానీ, అర్థం లేని గుడ్డి నమ్మకాల "కులము" కాదని ఆమె నిరూపించగలిగింది.
వీరికి ఒక కుమారుడూ, ఇద్దరు కుమార్తెలు కలిగారు. కుమారుడు ముత్యాల జయసూర్య నాయుడు ప్రముఖ హోమియోపతీ వైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదుకు చెందిన రాజకీయ నాయకుడు. వీరి కుమార్తెలలో ఒకరైన పద్మజా నాయుడు బెంగాల్ గవర్నర్గా పనిచేశారు కూడా.
వివాహమై బిడ్డలు పుట్టినా, ఆమె కేవలం తన సంతోషం తన పిల్ల సుఖమే కాకుండా బ్రిటిష్ వారి పాలనలో భారతీయులు ఎదుర్కుంటున్న సమస్యలపై పోరాడారు. గంగిరెద్దుల్లా వారు చెప్పిన దానికల్లా తలలూపుతూ మన సంపదనంతా వారికి అప్పజెప్పి మనము వారి చెప్పు చేతల్లో బ్రతకడమేంటని గళమెత్తారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ ఆ రోజులలో గోపాల కృష్ణగోఖలే నాయకత్వంలో ఉద్యమాలు సాగిస్తోంది.
రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు చేశారు?
వీరు మహిళాభివృద్దికి ఎంతో కృషిచేసి 1906 లో మహిళలకు విద్య అవసరమని దేశమంతా ఎన్నో మహిళా సమావేశాలు ఏర్పరచి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో పాటు పడ్డారు. 1915 వ సంవత్సరం బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలకూ, 1916 లో జరిగిన లక్నో కాంగ్రెస్ సభలలో ఆమె పాల్గొనటం జరిగింది. ఆనాటి కాంగ్రెస్ భావాలు చాలా ఆదర్శంగా ఉండేవి. సరోజినీనాయుడు భారతదేశములో గల ముఖ్యమైన, నగర, పట్టణాలు తిరుగుతూ స్వాతంత్ర్యోద్యమ ఉపన్యాసాలిచ్చి, ప్రజలతో భాష విప్లవము వచ్చేందుకు కారకురాలయింది. మృదువుగా మాట్లాడుతూ, ఎంత కఠినమైన విషయాలైనా, శ్రోతల గుండెలను హత్తుకునేలా ఆమె గంభీరమైన ఉపన్యాసం ఇచ్చేది. ఇక రెండవ ఎపిసోడ్ లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం..
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments