రూపాయికే విమాన ప్రయాణం
నేరవేరిన భారతీయుల కల
జీఆర్ గోపీనాథ్ జీవిత గాథ..
ఆయన భారతదేశంలోని ప్రజలకు అత్యంత చౌకగా విమాన ప్రయాణ సేవలను అందించారు. దీంతో విమాన ప్రయాణం గురించి కలలుగంటున్నవారంతా ఆకాశంలో ప్రత్యక్షంగా విహరించారు. 28 ఏళ్ల వయసులోనే విజయవంతమైన వ్యాపారవేత్తగా మారిన ఆయన యువతకు స్ఫూర్తిదాయకునిగా నిలిచారు. ఆయనే ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్... ఆయన జీవితానికి సంబంధించిన వివిధ అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జీఆర్ గోపీనాథ్ 1951 నవంబర్ 13 న కర్ణాటకలోని హసన్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన పూర్తిపేరు
గోరేర్ రామస్వామి అయ్యంగార్ గోపీనాథ్. ఇంట్లో ఎనిమిది మంది పిల్లలలో రెండవవాడు గోపీనాథ్. అతని తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు. చిన్ననాడే సైన్యంలో చేరాలని కలలుకన్న గోపీనాథ్ తన కుటుంబ సభ్యుల సహకారంతో 1962లో బీజాపూర్లోని సైనిక్ పాఠశాలలో చేరారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అనంతరం సైనిక శిక్షణకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ అకాడమీలో చదువు పూర్తి చేశారు. చివరికి సైన్యంలో చేరాలన్న తన కలను నెరవేర్చుకున్నారు. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్య్ర యుద్ధంలో పాల్గొన్నారు. తన 20 ఏళ్ల వయసులో ఆర్మీలో చేరిన గోపీనాథ్ 8 ఏళ్ల సర్వీసు అనంతరం తన 28 సంవత్సరాల వయస్సులో సైన్యం నుండి రిటైర్ అయ్యారు.
అనంతరం, గోపీనాథ్ తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు వేసుకున్నారు. తనదగ్గరున్న చిన్నపాటి పెట్టుబడితో తొలుత పట్టు పురుగుల పెంపకం కొనసాగించారు. ఈ వ్యాపారానికి అప్పట్లో విపరీతమైన ఆదరణ ఉండేది. గోపీనాథ్ ఈ పరిశ్రమలో అనేక ఆవిష్కరణలను చేసి, విజయవంతమైన వ్యాపారవేత్తగా మారారు. ఆ తర్వాత మోటర్బైక్ అమ్మకాలు, హోటళ్ల నిర్వహణ వంటి వ్యాపారాలు కూడా సాగించారు. 1997 అతని జీవితంలో మరపురాని సంవత్సరం. ఆ ఏడాది అతని అతిపెద్ద కల నెరవేరింది. గోపీనాథ్ సారధ్యంలో డెక్కన్ ఏవియేషన్ కంపెనీ చార్టర్ హెలికాప్టర్ సేవలను ప్రారంభించింది. నాడు విజయవంతంగా నడిచిన హెలికాప్టర్ సేవలు పలువురు ప్రముఖ రాజకీయ నాయకుల ప్రయాణాలకు ఎంతగానో వినియోగమయ్యాయి. ఈ నేపధ్యంలోనే డెక్కన్ ఏవియేషన్ సంస్థకు మంచి పేరు వచ్చింది.
హెలికాప్టర్ సేవలను విమానయానంలోకి మార్చాలనుకున్న గోపీనాథ్ 2003 లో ఎయిర్ డెక్కన్ను ప్రారంభించారు. ఆ రోజు నుంచే భారతదేశంలో చౌకైన విమాన ప్రయాణ సేవలను ఎయిర్ డెక్కన్ అందించినట్లు చెప్పవచ్చు. 2006లో ఎయిర్ డెక్కన్ ప్రకటించిన రూపాయికే విమాన టిక్కెట్ ఆఫర్ సంచలనం సృష్టించింది. టికెట్లు కొనుగోలు చేసేందుకు అప్పట్లో సంస్థ కౌంటర్ల వద్ద వందల సంఖ్యలో జనాలు బారులు తీరారు. ఈ ఆఫర్కు కస్టమర్ల నుంచి లభించిన అపూర్వ స్పందన దేశీయ విమానయాన రంగంలో చౌక విమానయాన సేవలకు బాటలు వేసింది. విమాన రంగంలోకి అడుగుపెట్టిన ఇండిగో, స్పైస్జెట్, గోఎయిర్, జెట్లైట్ సంస్థలకు ఎయిర్ డెక్కనే ఆదర్శం. చాలా మంది మధ్యతరగతి ప్రజలు ఎయిర్ డెక్కన్ సేవల ద్వారా విమానాల్లో ప్రయాణించ గలిగారు. అయితే అతి తక్కువ టిక్కెట్ ఛార్జీల కారణంగా ఎయిర్ డెక్కన్ భారీ నష్టాలను చవిచూసింది. 2008లో ఈ సంస్థ విజయ్మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో విలీనమైంది. ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ 2012లో సర్వీసులు నిలిపివేసింది. ఈ వైఫల్యానికి ఏమాత్రం భయపడని గోపీనాథ్ ఈ వైఫల్యాల పాఠాలను దృష్టిలో ఉంచుకుని, వాయు రవాణా రంగాన్ని తన ప్రధాన వృత్తి రంగంగా తిరిగి మరోసంస్థను స్థాపించారు. 2009 లో 'డెక్కన్ 360' పేరుతో కార్గో విమానయాన సంస్థను గోపీనాథ్ ప్రారంభించారు.
2017లో మళ్లీ ఎయిర్లైన్ మార్కెట్లోకి ఎయిర్ డెక్కన్ రీఎంట్రీ ఇచ్చింది. గతంలో రూపాయికే విమాన టికెట్ అందించడం ద్వారా సామాన్యుల్లో సైతం విమానయానంపై ఆసక్తి పెంచిన సంస్థ.. మళ్లీ అదే ఆఫర్తో తన రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఉడాన్ పథకంలో భాగంగా సేవలందించేందుకు ముందుకు వచ్చిన ఎయిర్ డెక్కన్.. ముంబై, ఢిల్లీ, కోల్కతా, షిల్లాంగ్లను దగ్గర్లోని చిన్న నగరాలతో కనెక్ట్ చేసేలా విమాన సర్వీసులు ప్రారంభించింది. ముంబై - నాసిక్ల మధ్య తొలి విమాన సేవలు ప్రారంభించింది. ఆ తర్వాత ఢిల్లీ, కోల్కతా, షిల్లాంగ్ నుంచి సమీపంలోని నగరాలకు విమానాలు నడిపారు. ఈ సేవల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఒక్క రూపాయికే టిక్కెట్ ఆఫర్ను ప్రకటించారు. అయితే, ఈ ఆఫర్ కేవలం లక్కీ ప్రయాణికులు మాత్రమే అందించారు.
ఇదిలావుండగా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధిపతి విజయ్ మాల్యా కేసు.... డెక్కన్ ఏవియేషన్ లిమిటెడ్ (డీఏఎల్) వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ మెడకు చుట్టుకోనున్నదనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. మాల్యా అప్పుల ఎగవేత కేసులో గోపీనాథ్ పాత్రపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. అయితే దీనిపై గోపీనాథ్ స్పందించలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న అప్పులను దారిమళ్లించేందుకు గోపీనాథ్ సంతకాలు చేసిన పత్రాలను ఉపయోగించడాన్ని దర్యాప్తు బృందాలు పరిశీలించాయి. ఎస్బీఐ మాత్రమే కాకుండా యాక్సిస్ బ్యాంక్ ఖాతాల ద్వారా నిధులు మళ్లించడంలో గోపీనాథ్ పాత్రను సీబీఐ పరిశోధించింది. రుణాలు మంజూరు చేసినపుడు గోపీనాథ్ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ డైరెక్టర్ గా ఉన్నారు. 2007లో తన ఎయిర్ డెక్కన్ ను మాల్యాకు అమ్మేసిన గోపీనాథ్ కింగ్ ఫిషర్ బోర్డులో సభ్యుడిగా చేరారు.
డెక్కన్ ఏవియేషన్కు ఎస్బీఐ 340 కోట్ల రూపాయల రుణం ఇచ్చిన వ్యవహారంలోనూ గోపీనాథ్ పాత్రని ఏజెన్సీ పరిశీలించింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో నిధుల మళ్లింపు పత్రాలపై గోపీనాథ్ సంతకాలు చేసినట్టు తేలింది. 2008 ఫిబ్రవరిలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ గోపీనాథ్ కి 30 కోట్లు చెల్లించడాన్ని కూడా పరిశోధిస్తున్నారు. ఎస్బీఐ 2008, ఫిబ్రవరి 1న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు 29.96 కోట్లు విడుదల చేయగానే ఈ చెల్లింపు జరగడం సందేహాలకు తావిచ్చింది. షేర్ హోల్డర్లు లేదా హైకోర్టుకు తెలియజేయకుండా... 'నాన్ కంపీట్ ఫీ' కింద గోపీనాథ్కి రూ.30 కోట్లు చెల్లించడంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ 2017లో పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ లావాదేవీల్లో ప్రత్యక్షంగా పాత్ర ఉన్న పలువురిపై నేరపూరిత కుట్ర, మోసం, తప్పుడు పత్రాలు సృష్టించిన నేరాల కింద అభియోగాలు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐఓ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సిఫార్సు చేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, డెక్కన్ల ఒప్పందంలో కార్పొరేట్ నైతిక విలువలతో రాజీ పడ్డారని ఎస్ఎఫ్ఐఓ తెలిపింది. అయితే డెక్కన్ ఏవియేషన్లో తాను మైనారిటీ షేర్ హోల్డర్ని మాత్రమేనని గోపీనాథ్ వాదించారు. ఎస్ఎఫ్ఐఓ నివేదిక ఆధారంగా పరిశోధిస్తున్న సీబీఐ, మాల్యాకు వ్యతిరేకంగా చేస్తున్న వాదనలు గోపీనాథ్కు కూడా వర్తిస్తాయనే వార్తలు వచ్చాయి.
తాజాగా రీజనల్ క్యారియర్ఎయిర్ డెక్కన్ తన ఆపరేషన్స్ను రద్దు చేసింది. తదుపరి నోటీసులు వచ్చేంత వరకు ఎలాంటి ఆపరేషన్స్ సాగవని తెలిపింది. ఉద్యోగులందరకీ ఎలాంటి వేతనాలు ఉండవని చెప్పింది. ఫలింగా వైరస్ దెబ్బకు అన్ని ఆపరేషన్స్ ను మూసివేసి... జీతాలు ఇవ్వని తొలి ఏవియేషన్ కంపెనీగా ఎయిర్ డెక్కన్ నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా, దేశీయంగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామల నేపధ్యంలో కమర్షియల్ ప్యాసెంజర్ ఫ్లయిట్స్ ను మూసివేయాలని ఇండియన్ రెగ్యులేటర్ ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ఎయిర్డెక్కన్ తన ఆపరేషన్స్ను రద్దు చేస్తున్నట్టు సీఈవో అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు.
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments