వధువును ఇంట్లో దాచి..
వరుని ఇంట్లోవారికి తెలియకుండా ఉత్కంఠ పరిస్థితుల్లో.....
సంఘసంస్కర్త కందుకూరి చేసిన తొలి వితంతు వివాహం..
ఆనాడే ఎవ్వరూ ఊహించని ఆలోచనలతో వందేళ్ళ ముందుచూపుతో ఆయన చేసిన మహత్కార్యం అనితర సాధ్యం..
ఆయన ఒక గొప్ప సాహితీవేత్త, సంఘసంస్కర్త. బహుముఖ ప్రజ్ఞాశాలి. వితంతు వివాహాలు నిర్వహించడంతో పాటూ ప్రోత్సహించిన మహనీయుడు. తెలుగువారిని చైతన్యవంతులుగా చేసిన ధీరుడు. బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించిన సమాజ సేవకుడు... ఆయన మరెవరో కాదు... కందుకూరి వీరేశలింగం పంతులు...రండి... ఆయన గురించి, ఆయన జరిపించిన తొలి వివాహం వెనుకనున్న విశేషాల గురించి తెలుసుకుందాం....
వీరేశలింగం పంతులు ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలో 1848 సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన సుబ్బారాయుడు, పూర్ణమ్మ దంపతులకు జన్మించారు. వీరేశలింగం పంతులుకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అతని తండ్రి చనిపోయారు. తండ్రి సోదరుడైన వెంకటరత్నం వీరిని దత్తత తీసుకొని సొంత బిడ్డలాగా పెంచారు. వీరేశలింగం ప్రాథమిక విద్య అంతా రాజమహేంద్రవరంలోనే సాగింది. వీరేశలింగం పంతులుకు తన 13 వ ఏట బాపమ్మతో వివాహం జరిగింది. అప్పుడు ఆమె వయసు ఎనిమిది ఏళ్లే. భర్త సంస్కరణలను, ఉద్యమాలను, భావాలను అర్ధం చేసుకొని వారి వెనుక నిలబడి ప్రోత్సహించారు బాపమ్మ.
వీరేశలింగం తల్లి పూర్ణమ్మ ఆధునిక భావాలు కలిగిన మహిళ. ఆధునికత కోసం ఆమె, బాపమ్మ పేరును రాజ్యలక్ష్మిగా మార్చారు. వీరేశలింగం పంతులు 1869 వ సంవత్సరంలో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై, కోరంగి అనే గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. అక్కడ రెండు, మూడు సంవత్సరాలు ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా పని చేసిన తరువాత ధవళేశ్వరానికి మకాం మార్చారు. అక్కడ ఒక ఆంగ్ల మాధ్యమ విద్యాలయంలో ఉపాధ్యాయునిగా చేరారు. వీరేశలింగం పంతులు 1876లో ఒక తెలుగు పత్రికను ప్రారంభించి, ఆ పత్రికలో స్త్రీల సమస్యలను గురించి అనేక వ్యాసాలు రాశారు. ఆ తరువాత వీరేశలింగం వివేక వర్ధిని అనే పత్రికను స్థాపించి తన ఉద్యమానికి ఊతం గా ఆ పత్రికను నడిపారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే, కుల నిర్మూలనకు కూడా అకుంఠితదీక్షతో పని చేశారు.
ఆ రోజుల్లో కందుకూరి వీరేశలింగం స్త్రీలను చైతన్య పరిచేందుకు, వారికున్న హక్కులు తెలియచేసి వారిని జాగృత పరచటానికి సతీహితబోధిని అనే మరో పత్రికను కూడా ప్రారంభించారు. 1878లో దేవదాసీ, భోగం మేళం లాంటి దురాచారాలను ఎండగడుతూ భారీ స్థాయిలో ఉద్యమాలు చేశారు. వితంతు వివాహాలు వీరి ఆధ్వర్యంలో విరివిగా జరగటం మొదలయ్యాయి. సమాజం నుంచి ఎన్నో అడ్డంకులు, విమర్శలు వచ్చినప్పటికీ వాటినన్నిటినీ ఓర్పుగా, ధైర్యంగా ఎదుర్కోవటమే కాకుండా, తన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ప్రజలను ఒప్పించి మెప్పించగలిగారు. తరువాతి కాలంలో వీరు ఒక వితంతు శరణాలయం ప్రారంభించారు. బాల్య వివాహాలను నిరోధించటంపై దృష్టిసారించి దాని కోసం ఒక చట్టం కూడా రావటానికి కృషి చేశారు. కన్యాశుల్కం లాంటి దురాచారాలను ఎండగట్టారు.
ఒకరోజు కృష్ణమండలంలోని తిరువూరు డిప్యూటీ తహసిల్దారు బ్రహ్మశ్రీ దర్భా బ్రహ్మానందం నుంచి వీరేశలింగం పంతులుకు ఒక ఉత్తరం వచ్చింది. ‘తిరువూరు తాలూకా రేపూడి గ్రామంలో గౌరమ్మ అనే పన్నెండేళ్ల బాల వితంతువు ఉన్నదనీ, ఆమెకు మళ్లీ పెళ్లి చేసేందుకు ఆమె తల్లి సీతమ్మ సిద్దంగా ఉన్నారని... అందులోని సారాంశం. దానికి వీరేశలింగం పంతులు ఇక ‘మీదే ఆలస్యం’ అని సమాధానం ఇచ్చారు. అమ్మాయిని భద్రంగా రాజమహేంద్రవరం తీసుకువచ్చి, తన ఇంట్లో, తన భార్య సంరక్షణలో ఉంచారు. ఆ వెంటనే వరుడి వేట మొదలు పెట్టారు. ఆ క్షణంలో.... విశాఖపట్నం పోలీస్ హెడ్ క్వార్టర్ట్స్లో పనిచేస్తున్న గోగులపాటి శ్రీరాములు అనే యువకుడు వీరేశలింగం పంతులు మదిలో మెదిలారు. గతంలో శీరాములు.... వీరేశలింగం ఇంట్లోనే ఉండి చదువుకున్నారు. వీరేశలింగం అతనికి కబురు పంపారు. శ్రీరాములు గౌరమ్మను చూడకుండానే పెళ్లికి ఒప్పుకున్నారు. అయితే శ్రీరాములుకు అంతకుముందే పెళ్లయింది. భార్య అకస్మాత్తుగా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నారు. ఆ ఒంటరితనాన్ని పోగొట్టేందుకు పిల్లనిస్తామని ఎంతోమంది వచ్చినా నిరాకరిస్తూ... వితంతు వివాహం చేసుకోడానికి శ్రీరాములు ఎదురు చూస్తున్నాడు. అతని నిరీక్షణ ఫలించి చివరికి గౌరమ్మ దొరికింది!
పెళ్లి పనులు రహస్యంగా జరుగుతున్నాయి. వరుడి పేరును కూడా పంతులుగారు అత్యంత రహస్యంగా ఉంచారు. గౌరమ్మ అనే బాల వితంతువుకు పంతులుగారింట్లో పెళ్లి జరగబోతోందని ఊరంతటికీ తెలిసింది. కానీ వరుడెవరో ఎక్కడా బయటకు పొక్కలేదు. పెళ్లికి కావలసిన రక్షణ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కల్నల్ పోర్చిస్ దొరగారి నుంచి లభించింది. పెళ్లికి అవసరమైన డబ్బును పంతులుగారి స్నేహితుడు పైడా రామకృష్ణయ్య సమకూర్చారు. వధూవరులకు కావలసిన నైతిక ధైర్యాన్ని వీరేశలింగం పంతులు అందించారు. ఈ విధంగా రాజమహేంద్రవరంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం జరిగింది. అయితే చివరి నిమిషంలో వరుడి తల్లిదండ్రులకు విషయం తెలిసి గగ్గోలు పెడుతూ కల్యాణ మండపానికి చేరుకున్నారు. వధూవరులపై వేయడానికి అక్షింతలు, ఇవ్వడానికి అశీర్వచనాలు తప్ప వాళ్లకేం మిగల్లేదు.
అయితే ఆ వివాహానికి హాజరైనవారందరినీ అప్పటి సమాజం గుర్తుపెట్టుకుని మరీ వెలివేసింది. వారిని వేడుకలకు, వివాహాలకు పిలవడం మానేసింది. వీరేశలింగం పంతులును తప్పుపట్టింది. అయితే వీటికి వీరేశలింగం భయపడలేదు. అస్సలు వెనకడుకు వేయలేదు. నేనింతే... ఇలాగే ఉంటాను.... ఇదొక్కటే కాదు ఇంకా చాలా పెళ్లిళ్లు ఇలాగే చేస్తానని సవాల్ విసిరారు. వీరేశలింగం పంతులు శారీరకంగా బలహీనులుగా కనిపించినప్పటికీ, మానసికంగా ఎంతో బలవంతులు. పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు తదితర మిత్రులు, విద్యార్థుల బలం ఆయనకు తోడయ్యింది. అన్నిటికన్నా పెద్ద బలం ఆయన అర్ధాంగి రాజ్యలక్ష్మి. వీరందరి సహకారంతో వీరేశలింగం పంతులు తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడ్డారు. నలభై వరకూ వితంతు వివాహాలను జరిపించారు. ఈ సాహసమే ఆయనను సంఘసంస్కర్తగా నిలబెట్టింది.
బాలికలకు విద్యకోసం మరొక విద్యాలయాన్ని స్థాపించారు. ‘రావు బహదూర్’ అనే బిరుదు కూడా పొందారు. తరువాత బ్రహ్మ సమాజం వైపు ఆకర్షితులై దాని వ్యాప్తి కోసం విశేష కృషి చేశారు. బ్రహ్మసమాజం ఉద్దేశాలను దృష్టిలో ఉంచుకొని ‘హిత కారిణి’ అనే మరొక విద్యాలయాన్ని కూడా ప్రారంభించారు. తెలుగు, ఆంగ్లం, సంస్కృత భాషలలో విశేష పాండిత్యం ఉన్నకారణంగా వీరేశలింగం అనేక గ్రంథాలను రచించారు. తెలుగులో మొట్ట మొదటి నవలైన ‘రాజశేఖర చరిత్ర’ను రాశారు. వ్యావహారిక భాషా ఉద్యమానికి వీరేశలింగం ఎనలేని కృషి చేశారు. సమాజంలోని దురాచారాలాను ఖండిచటం కోసం పలు వ్యంగ్య నాటకాలు కూడా రచించారు..
సాంఘిక పోరాటంలో, భర్తకి తగిన భార్యగా రాజ్యలక్ష్మమ్మ పేరుపొందారు. తన భర్త చేస్తున్నది సమాజ హితం కోసం అని ఆమె గ్రహించారు. బంధువుల బెదిరింపులు, బహిష్కారాలు, ఆంక్షలను ఆమె ఏనాడూ లక్ష్య పెట్టలేదు. భార్యపై కందుకూరికి ఎనలేని గౌరవం ఉండేది. జీవితకాలం ఆదర్శదంపతులుగా నిలిచిన వీరికి పిల్లలు లేరు. వీరేశలింగానికి కొండంత అండగా నిలిచిన రాజ్యలక్ష్మమ్మ 1910లో కన్ను మూశారు. అది వీరేశలింగం పంతులకు తీరని నష్టంలా పరిణమించింది. ఆమె సమాధి తన సమాధి కన్నా ఎత్తుగా ఉండాలని భావించి అలాగే నిర్మింపజేసి, అక్కడ ఆమెకు ఇష్టమైన పూల మొక్కలు పెంచారు. తన స్వీయ చరిత్రను భార్య రాజ్యలక్ష్మమ్మకే అంకితం ఇచ్చారు. భార్యా వియోగం తట్టుకోలేక ఆరోగ్యం సహకరించక, చివరి దశలో ఆర్ధిక సమస్యలను కూడా ఎదుర్కొన్నారు. 1919, మే 27 న తన 71 వ సంవత్సరాల వయసులో కందుకూరి వీరేశలింగం పంతులు తుదిశ్వాస విడిచారు.
ఇలాంటి ఎందరో మహనీయులను కన్నది మన భారత దేశం.. జైహింద్..
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments