ఇంజినీరింగ్లో నూతన ఒరవడుల సృష్టికర్త..
దేశఖ్యాతిని ఇనుమడింప జేసిన
తెలుగు ఆణిముత్యం
మోక్షగుండం విశ్వేశ్వరయ్య..
గంధపు చెక్కవలే సేవలో అరిగిపో... కానీ ఇనుములా తుప్పు పట్టిపోకు... అనే మాటలను తుచ తప్పకుండా పాటించిన గొప్ప వ్యక్తి ఆయన. మేము మాటలతో కాలయాపన చేశాం... మీరు నిరంతర క్రియాశూరులై నవ భారత నిర్మాణానికి కృషి చేసిన మహనీయులంటూ నాటి ప్రధాని నెహ్రూ చేత అభినందనలు అందుకున్నారు.... ఆయనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య.... ఆ అపర భగీరథుని జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1861 సెప్టెంబర్ 15న శ్రీనివాస శాస్త్రి, వెంకట లక్ష్మమ్మ దంపతులకు విశ్వేశ్వరయ్య జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో గల మోక్షగుండం అనే గ్రామానికి చెందినవారు. తరువాతికాలంలో కర్నాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా చిక్బల్లాపూర్ సమీపంలోని ముద్దనహళ్లికి వెళ్లి స్థిరపడ్డారు. విశ్వేశ్వరయ్య ప్రాథమిక విద్య చిక్బళ్లాపూర్లో సాగింది. తన 15వ ఏటనే తండ్రిని కోల్పోయిన విశ్వేశ్వరయ్య మేనమామ రామయ్య ప్రోత్సాహంతో బెంగళూరు సెంట్రల్ కాలేజీలో 1880లో ఎంఎలో ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. గణితంలో అపార ప్రతిభ కలిగిన విశ్వేశ్వరయ్యను మైసూరు రాజ్య దివాను రంగయ్య గుర్తించారు. అనంతరం ప్రభుత్వానికి సిఫారస్సు చేసి, స్కాలర్షిప్ ఇప్పించారు. ఆ ఉపకార వేతనంతో ఆయన పుణే వెళ్లి ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
అనంతరం బొంబాయి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పబ్లిక్ వర్క్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్గా నియమించింది. మరుసటి ఏడాది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నియమితులయ్యారు. ఆంగ్ల పాలకులు విశ్వేశ్వరయ్య కార్యదీక్షను గుర్తించి, ప్రపంచ జలాశయాల్లో ఒక్కటైన సుక్నూర్ బరాజ్ నిర్మాణానికి ఇంజినీర్గా నియమించారు. దీంతో సింధూనది నీరు సుక్నూర్కు చేరేలా చేశారు. ఆ నది నీరు వడగట్టడానికి ఒక వినూత్న విధానం రూపొందించారు. దాహరి దగ్గర నంబనది మీద సైఫన్ పద్ధతిన కట్ట నిర్మించారు. అక్కడ విశ్వేశ్వరయ్య తన మేధాశక్తితో ఆటో మేటిక్ గేట్లు నిర్మించి అందరినీ ఆశ్చర్యపరచారు.
1909లో మైసూర్ ప్రభుత్వం ఆయనను చీఫ్ ఇంజినీర్ గా నియమించింది. కృష్ణరాజసాగర్ డ్యాం డిజైన్ ఆయన ఆధ్వర్యంలోనే నిర్మాణం జరిగింది. దేశంలోనే తొలిసారిగా నీటి వృథాను అరికట్టేందుకు నూతన చర్యలను చేపట్టారు. వర్షపు నీటిని ప్రాజెక్టుల ద్వారా నిలుపుదల చేశారు. ప్రవహించే నీటిని ఆనకట్టలు, ఉక్కు తలుపుల ద్వారా అరికట్టడానికి రూపకల్పన చేసి పలు నిర్మాణాలు చేపట్టారు. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ డ్రైనేజీ పద్ధతులకు రూప కల్పన చేసింది కూడా ఆయనే. ప్రముఖ ఇంజినీర్లు అయిన కెఎల్.రావు, జాఫర్ అలీలు కూడా ఆయన సహాయ సహకారాలు తీసుకున్నారు. విశ్వేశ్వరయ్యకు 1948 లో మైసూర్ ప్రభుత్వం డాక్టరేట్ ఎల్.ఎల్.డి ఇచ్చి సత్కరించింది. అలాగే బాంబే, కోల్కతా, బెనారస్, అలహాబాద్ తదితర యూనివర్శిటీలు డాక్టరేట్ పురస్కారాలను అందజేశాయి. భారత ప్రభుత్వం 1955లో భారతరత్న అవార్డును ప్రదానం చేసి ఘనంగా సన్మానించింది. ఆయన ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ సభ్యులుగా, కర్నాటకలో చీఫ్ ఇంజినీరుగా అనేక బాధ్యతలను నిర్వహించి సివిల్ ఇంజనీరింగ్లో అప్పట్లోనే నూతన వరవడులను సృష్టించి ప్రపంచ స్థాయిలో రికార్డులు సాధించారు.
1901లో భారత ప్రభుత్వ ప్రతినిధిగా విశ్వేశ్వరయ్య జపాన్ వెళ్ళి అక్కడ కుటీర పరిశ్రమల తీరుతెన్నులను గమనించారు. ఆ పద్ధతిలో కుటీర పరిశ్రమల అభివృద్ధికి బృహత్ పథకాన్ని రూపుదిద్ది ప్రభుత్వానికి అందించారు. జపాన్ పర్యటనానంతరం, విశ్వేశ్వరయ్య పుణే నగర నీటి సరఫరా పథకాన్ని రూపొందించారు. ఆ నిర్మాణ కాలంలోనే ఆటోమేటిక్ స్లూస్గేట్ రూపొందించారు. ఈ స్లూస్గేట్ నిర్మాణం ప్రపంచ ఇంజనీర్ల మన్ననలు అందుకున్నది. ఈ కొత్త పరిశోధనను తన పేరు మీద పేటెంట్ చేసుకోవలసిందిగ మిత్రులు సూచించారు. తన కార్యనిర్వహణలో భాగంగా సాగింది కావడంతో పేటెంట్ తీసుకోవటం సముచితం కాదని సున్నితంగా తిరస్కరించి విశ్వేశ్వరయ్య తన గొప్ప మనసు చాటుకున్నారు.
తన సొంత రాష్ట్రమైన మైసూరు సంస్థానాన్ని ఆదర్శ సంస్థానంగా విశ్వేశ్వర్య తీర్చిదిద్దారు. చీఫ్ ఇంజినీర్గా, ఆ తర్వాత దివాన్గా పని చేసిన ఆరేళ్ళలో అరవయ్యేళ్ళ అభివృద్ధిని సాధించారు. హెబ్బాళ్ వ్యవసాయ కళాశాల, మైసూరు విశ్వవిద్యాలయం, చాంబర్ ఆఫ్ కామర్స్, సోప్ ఫ్యాక్టరీ, కన్నడ సాహిత్య పరిషత్ మొదలైన వాటిని నెలకొల్పారు. విశ్వేశ్వరయ్య సారధ్యంలో నిర్మితమైన కృష్ణరాజసాగర్ కారణంగా లక్షలాది ఎకరాల మెట్ట భూములు సస్యశ్యామలంగా మారాయి. బృందావన్ ఉద్యానవనం విశ్వేశ్వరయ్య ప్రకృతి ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. భారత దేశ సంస్థానాలలో మొదటి ఉక్కు కర్మాగారాన్ని మైసూరు ప్రాంతంలోనే నెలకొల్పారు.
విశ్వేశ్వరయ్య తన 100 సంవత్సరాల వయస్సులో కళ్ళద్దాలు లేకుండా చదివేవారు. దేశ విదేశాలలోని అనేక విశ్వవిద్యాలయాలు వారిని సత్కరించాయి. విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ రంగానికే పితామహునిగా నిలిచారు. 1911లో ఆయన "కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్" గా నియమితులయ్యారు. 1915లో మైసూరు దివానుగా విశ్వేశ్వరయ్య ఉన్నప్పుడు ఆయన ప్రజలకు చేసిన ఎన్నో సేవలకు గాను బ్రిటిషు ప్రభుత్వం బిరుదును ఇచ్చింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1955లో భారత దేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానం చేశారు.
భారతదేశంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1923లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు ఆయన అధ్యక్షునిగా వ్యవహరించారు. విశ్వేశ్వరయ్య విద్యారంగం, ఇంజినీరింగ్ రంగాలలో విశేషమైన గుర్తింపు లభించింది. బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్శిటీని ఆయన పేరు మీద నెలకొల్పారు. బెంగళూరులోని యూనివర్శిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, సర్ఎమ్. విశ్వేశ్వరయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పుణేలోని నాగపూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మొదలైనవి ఆయన పేరుతో పిలవబడుతున్నాయి. పుణేలో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని నెలకొల్పారు. ఇంజినీర్గా విశేషంగా దేశానికి సేవ చేసిన విశ్వేశ్వరయ్య 1962 ఏప్రిల్ 12వ తేదీన తన 101 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. గొప్ప సివిల్ ఇంజినీర్గా, పాలనాధ్యక్షునిగా పేరొందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య నవ భారత నిర్మాణానికి ఎనలేని కృషి చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 30 ఏళ్లపాటు సేవలు అందించిన ఆయన దేశ ప్రగతి సాధన కృషిలో భాగస్వాములయ్యారు.
ఇలా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితం లో భారత దేశం లో అనేక ఆనకట్టలు నిర్మించి సరికొత్త నీటి వనరుల వినియోగానికి చారిత్రాత్మక పంథాను కొనసాగించారు.. ఈ మహనీయుడికి సంభందించి మీకు తెలిసిన మరికొన్ని విశేషాలు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి..
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments