పటేల్ లేకపోతే నెహ్రూ లేరా?
నాడు ఎఐసీసీ అధ్యక్షునిగా నెహ్రూను ఎంపిక చేసిన గాంధీజీ!
జాతిపిత మాటను మన్నించిన పటేల్?
ఇప్పటివరకూ బయటకు రాని సంచలన వాస్తవాలు..
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, తొలి హోం మంత్రి-ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయి పటేల్లలో ఎవరు గొప్ప? అనే వివాదస్పద చర్చ ఇప్పటికీ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. పటేల్ లేకపోతే నెహ్రూ లేడని, కశ్మీర్ అగ్నిగుండంగా మారేందుకు నెహ్రూ విధానాలే కారణమనే వ్యాఖ్యానాలు చేసేవారు ఈ నాటికీ ఉన్నారు. అయితే నెహ్రూ, పటేల్ ఇద్దరూ మహనీయులే. ఈ ఇద్దరు మహానేతలు తమ జీవితాలను జాతి సముద్ధరణకు అంకితం చేశారు. వీరి గురించి ఇటువంటి చర్చ ఎందుకు జరుగుతున్నదనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధేయవాదానికి ఆకర్షితులై జైళ్లకు వెళ్లి నేతలు బయటకు వచ్చిన రోజులవి. నెహ్రూ తన జీవితకాలంలో తొమ్మిది సార్లు జైలుకు వెళ్లారు. మొత్తం 3,259 రోజుల పాటు వివిధ సందర్భాలలో లక్నో, అలహాబాద్, నబా, నైనీ సెంట్రల్ జైల్, బరేరి, డెహ్రాడూన్, అలీపూర్, ఆల్మోరా, అహ్మద్నగర్ జైళ్లలో కారాగార శిక్షను అనుభవించారు. 1947లో స్వాతంత్య్రం సిద్ధించినపుడు ఆయన వయసు 58 ఏళ్లు. 1889 నవంబర్ 14న జన్మించిన నెహ్రూ 1964లో మరణించారు. నెహ్రూ, పటేల్ సేవలను అంచనావేసే శక్తి ఎవరికీ లేదని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. దేశ సమగ్రతకు ‘ఉక్కుమనిషి’ సర్దార్ పటేల్ కృషి చేయగా, దేశ అభివృద్ధి, పంచవర్ష ప్రణాళికలు లక్ష్యంగా నెహ్రూ పనిచేశారు.
1948లో న్యూయార్క్ టైమ్స్లో రాబర్ట్ త్రుంబర్ అనే రచయిత నెహ్రూ, పటేల్ అనుబంధంపై ఆసక్తికరమైన వ్యాసం రాశారు. దాని ప్రకారం....నెహ్రూ, పటేల్ ఎవరికి వారు భావావేశం కలిగిన నేతలు. కానీ ఆ ఇద్దరు నేతలు సులువుగా తమ అభిప్రాయబేధాలను పక్కనపెట్టి కలిసిపోయే శక్తి కలిగినవారు. మహాత్మా గాంధీ మరణం తర్వాత తాము దేశాన్ని సరైన రీతిలో నడిపించాలనే వాస్తవాన్ని గుర్తించి, జవాబుదారీతనంతో వ్యవహరించారు. భారతదేశం ముక్కలు కాకుండా కలిసిపనిచేయాలనే గురుతరబాధ్యత తమపై ఉందనే సత్యాన్ని గ్రహించి మెలిగారని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు నెలల్లో గాంధీజీ కన్నుమూశారు. దేశంలో 565 సంస్థానాలను విలీనం చేసే బాధ్యత తమపై ఉందని పటేల్, నెహ్రూ గుర్తించారు. అదే సమయంలో రాజ్యాంగ రూపకల్పన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. 1948లోనే కశ్మీర్ను కబళించేందుకు దాయాది దేశం దాడికి దిగింది. 565 సంస్థానాలను భారత్లో విలీనం చేసేందుకు పటేల్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని అందరినీ ఒప్పించారు.
ఆనాటి కాలంలో మన దేశం భౌగోళికంగా గందరగోళంగా ఉండేది. పశ్చిమ, తూర్పు పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున హిందువులు, సిక్కులు భారత్కు వలస వచ్చారు. ఇక్కడి నుంచి ముస్లింలు కూడా అంతే సంఖ్యలో పాకిస్తాన్కు తరలి వెళ్లారు. ఇటు ఉత్తర భారతంలో, అటు పాకిస్తాన్లో నిత్యం గృహ దహనాలు, దోపిడీలతో అతలాకుతలమవుతున్న రోజులవి. అటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో భారత్ ముక్కలు చెక్కలు కాకుండా జవహర్లాల్, సర్దార్ పటేల్ కలిసి దేశానికి మార్గనిర్దేశనం చేశారు. 1946లో దేశ విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి వచ్చింది. అప్పటి 15 మంది పీసీసీ అధ్యక్షుల్లో 12 మంది... పటేల్ ఎఐసీసీ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకున్నారు. వారు పటేల్కు అనుకూలంగా ఓటు వేశారు. మిగిలిన ముగ్గురు ఎవరికీ ఓటు వేయలేదు. ఒక్క ఓటు కూడా నెహ్రూకు లభించలేదు. అయితే గాంధీ మాత్రం నెహ్రూనే అధ్యక్షునిగా ఉండాలని ఆదేశించారు. గాంధీ మాటను పటేల్ శిరసావహించారు. దేశ సమగ్రత, పార్టీ ఐక్యత కోసం పటేల్ చేసిన త్యాగం నిరుపమానమైనది. అందుకే ప్రధానిగా నెహ్రూ ఎన్నికైతే, హోం మంత్రిగా పటేల్ నియమితులయ్యారు.
పటేల్ 1875లో జన్మించగా, స్వాతంత్య్రం వచ్చే నాటికి ఆయన వయస్సు 73 సంవత్సరాలు. అంటే నెహ్రూ కంటే 15 సంవత్సరాలు పెద్ద. పటేల్ 1950 డిసెంబర్ 15వ తేదీన మరణించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అలుపెరగకుండా పోరాడిన పటేల్ 73 ఏళ్ల వయస్సులో సంస్థానాల విలీనమనే బృహత్తర పవిత్ర యజ్ఞాన్ని చేపట్టి విజయం సాధించారు. భారత్ రిపబ్లిక్గా అవతరించిన సమయంలో అంటే...1950 జనవరి 26 నాటికి ఆయన లోక్సభ సభ్యునిగా ఉన్నారు. అదే ఏడాది డిసెంబర్లో మరణించారు. పటేల్ చేసిన కృషి ఫలితంగానే నెహ్రూ మూడుసార్లు ప్రధానిగా కొనసాగారు. 1947 తర్వాత భారత్ పరిస్థితి దుర్భరంగా ఉండేది. ఢిల్లీకి ఇతర రాష్ట్రాల మధ్య కమ్యూనికేషన్లు అంతంత మాత్రంగానే ఉండేవి. ఎవరు శత్రువో, ఎవరు మిత్రుడో గుర్తించే యంత్రాంగం లేనేలేదు. ఎన్నో సవాళ్ల మధ్య అవతరించిన భారత్ను అభివృద్ధి మార్గం వైపు నడిపించిన ఘనత నెహ్రూ, పటేల్లకే దక్కుతుంది.
కశ్మీర్ విషయంలో నెహ్రూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదని చాలామంది విమర్శిస్తుంటారు. కానీ ఆ రోజులకు తగ్గట్టుగా నెహ్రూ రాజనీతితోనే వ్యవహరించారనే సమాధానం కూడా వినిపిస్తుంది. అయితే కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వైఖరిని ఎండగడుతూ నెహ్రూ కుమార్తె, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1971లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని వల్లనే పాకిస్తాన్ రెండు ముక్కలైంది. బంగ్లాదేశ్ అవతరించించడంతో పాకిస్తాన్ బలం క్షీణించింది. ఫలితంగా నెహ్రూ కశ్మీర్ అంశంలో సరైన నిర్ణయం తీసుకోలేదనే విమర్శలకు కొంతమేర గండిపడింది. శత్రుదేశాన్ని ముక్కలు చేసిన ఇందిరాగాంధీని ఆ నాటి ప్రతిపక్షనేత వాజపేయి అపర దుర్గగా పేర్కొన్నారు.
గతంలో ఒక సందర్భంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.... అలనాడు నెహ్రూ చేపట్టిన అభివృద్ధి అజెండాను ప్రశంసించారు. చాలామంది వ్యాఖ్యానిస్తున్నట్లు పదవుల విషయంలో, పరిపాలనలో నెహ్రూ, పటేల్లు ఏమాత్రం శత్రువులు కారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. వీరిద్దరూ మంచి స్నేహితులని, దేశాన్ని నడిపించే బాధ్యతను తమ భుజస్కంధాలపై మోశారని అంటారు. 1920 నుంచి 1947 వరకు దాదాపు 27 ఏళ్ల పాటు భారత జాతీయ కాంగ్రెస్లో పటేల్, నెహ్రూ కలిసి పనిచేశారు. వీరి మధ్య పొరపొచ్ఛాలు ఉన్నట్లు ఎక్కడా ఎటువంటి ఉదంతాలు కనిపించవు. పటేల్ జీవిత చరిత్రపై రాజ్మోహన్ గాంధీ రాసిన పుస్తకంలో... ‘దేశం స్వాతంత్య్రం సాధించేందుకు.... అనంతరం ఒక మహత్తరశక్తిగా అవతరించేందుకు గాంధీ, నెహ్రూ, పటేల్ ఉమ్మడి కృషి కారణం..’ అని పేర్కొన్నారు.
అందుకే, ఆనాడు జరిగిన అనేక సంఘటణలను తవ్వుకుంటూ కూర్చోవడం, ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ పోవడం వళ్ళ ఎటువంటి ప్రయోజనం లేదు.. ఇప్పుడు తక్షణం ప్రభుత్వాలు, ప్రజలు ద్రుష్టి సారించాల్సిన అంశాలు ఏవో బేరీజు వేసుకుని ఆ దిశగా ప్రయత్నాలు సాగించాలని న్యూస్ 6జి ఆశిస్తోంది..
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments