కొరుకుడు పడని ఉల్లి ధరలు
కోయకుండానే కన్నీళ్లు?
ప్రభుత్వాలకు తలనొప్పులు..
సామాన్యుని నిత్యావసర సరుకైన ఉల్లి ఇప్పుడు అందనంత ధరకు చేరుకుంది. ఫలితంగా వినియోగదారులకు ఉల్లిలేని కూరలతోనే కాలం గడపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీనికి పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వాలు సైతం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. ఇంతకీ ఉల్లి ధరలు ఇంతలా పెరగానికి గల కారణమేమిటి?
ఉల్లి ధర కిలో వంద రూపాయలకు చేరుకొని, ఇంకా ఎగబాకేలా కనిపిస్తోంది. ఇతర కూరగాయల ధరలూ కూడా పెరిగి కూచున్నాయి. లాక్డౌన్ దెబ్బకు ఉద్యోగాలు, ఉపాధులు కోల్పోయి జేబులు ఖాళీ అయిన తరుణంలో సాధారణ ప్రజానీకం పండుగలు జరుపుకోడమెలా అని తల్లడిల్లిపోతోంది. ఇటువంటి సమయంలో మరోసారి అసాధారణంగా పెరిగిపోయిన ఉల్లి ధర వారిని ఠారెత్తిస్తోంది. చైనా తర్వాత రెండవ స్థానంలో ఉల్లి ఉత్పత్తి కలిగిన దేశమైన భారత్లో ఉల్లి ధరలు ఇలా మండిపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. ఇందుకు దళారుల ప్రమేయమే కారణమనే ఆరోపణలు తలెత్తుతున్నాయి. గత ఏడాది నవంబర్, డిసెంబర్లలో కూడా ఉల్లి ధరలు ఇలాగే పెరిగిపోయాయి.
అక్టోబర్లో మహారాష్ట్ర నుంచి, డిసెంబర్లో గుజరాత్ నుంచి ఉల్లి పంటవచ్చి దేశంలో ఉల్లి గిరాకీని సంతృప్తి పరుస్తుంది. మామూలు రోజులలో కిలో 15 నుంచి 25 రూపాయల ధరలో లభించే ఉల్లి.... ఉన్నపళంగా రూ. 100కి చేరిపోతే సామాన్యులు దానిని కొనుగోలు చేసి తినగలరా? దేశంలో ఏటా 25 మిలియన్ టన్నుల ఉల్లి పండుతుంటే 13 మిలియన్ టన్నుల ఉల్లిని ప్రజలు వినియోగిస్తారు. మిగతాది ఎగుమతి అవుతుంది. గత ఏడాదిలో ఢిల్లీలో ఉల్లి సగటు ధర కిలో 45 రూపాయల వద్ద ఉంది. 2019 సెప్టెంబర్లో కిలో 58 రూపాయలకు అమ్మగా, డిసెంబర్ నాటికి 100 రూపాయలకు చేరింది. దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు కేంద్రం కనీస ఎగుమతి ధరను నిర్ణయించి... ఎగుమతులను నిరుత్సాహపరుస్తుంది. అలాగే నిల్వలపై ఆంక్షలు విధిస్తుంది. ఈ రెండు చర్యల వల్ల రైతులు నష్టపోతారని వ్యాపారులు అంటుంటారు.
గత ఏడాది చలికాలంలో ఉల్లి ధరలు కొన్ని చోట్ల కిలో రూ.160 నుంచి 180 వరకు పలికాయి. తిరిగి ఈ ఏడాది కూడా అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఉల్లి ధరల గురించి గత ఏడాది డిసెంబరులో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల మీద అప్పట్లో పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సభ్యురాలు సుప్రియా సూలే పెరిగిన ఉల్లి ధరల గురించి మాట్లాడుతూ... వెల్లుల్లి తినను కనుక మీరు ఆందోళన చెందవద్దు. నేను పెద్దగా ఉల్లి, వెల్లుల్లి తినని కుటుంబం నుంచి వచ్చానంటూ విచిత్రమైన సమాధానం ఇచ్చారు.
2019-20 ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్రలో 11 మిలియన్ల 7 లక్షల టన్నుల ఉల్లి పండించింది. ఇందులో 10 మిలియన్ టన్నులు రబీ కాలంలోనే పండింది. మహారాష్ట్రలో పండే ఉల్లి ఏటా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు దేశ అవసరాలను తీర్చవలసి ఉంటుంది. గత ఏడాది అక్టోబరు 20 వ తేదీన ఉల్లి ధరలతో పోలిస్తే... అదే రోజున ఈ ఏడాది 12 శాతం ధరలు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం చూస్తే... ధరల పెరుగుదల గురించి ఆందోళన చెందాల్సిన పని లేదన్నది ప్రభుత్వ ప్రకటన సారాంశంగా తెలుస్తోంది. ఉల్లి, పప్పుధాన్యాలు, ఖాద్య తైలాలు, నూనె గింజలు, తృణధాన్యాలు, బంగాళాదుంపల నిల్వలకు సంబంధించి ఎలాంటి పరిమితులు ఉండవు, ఏ మేరకైనా నిల్వ సుకోవచ్చని తాజా చట్ట సవరణ తెలిపింది. అయితే మరి నియంత్రణ ఎప్పుడు అంటే... నిల్వ ఉండని తోట పంటల ఉత్పత్తులైన ఉల్లి, బంగాళాదుంపల ధరలు పెరిగినపుడు మాత్రమే ప్రభుత్వాలు నియంత్రణలను అమల్లోకి తెస్తాయి.
మన దేశంలో ఏడాదికి ఉల్లి మూడు పంటలు పండుతుంది. వేసవి పంట ఏప్రిల్లో... ఖరీఫ్ తొలి పంట సెప్టెంబరు, ఖరీఫ్ రెండవ పంట నవంబరు తరువాత మార్కెట్కు వస్తుంది. వర్షాలు, తెగుళ్ల కారణంగా కొంత పంట నష్టం జరుగుతుంది. అలాగే ఉల్లివిత్తనాల కొరత, రబీ పంటలో నిల్వ చేసిన దానిలో 35 శాతం పాడైపోవటం ప్రస్తుత ఉల్లిధరల పెరుగుదలకు కారణాలుగా వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఉల్లి వ్యాపారం మొత్తం ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోనే ఉంది.
ఈ ఏడాది ఆగస్టు నుంచి ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ అక్టోబరు 18 వరకు గత ఏడాది కంటే తక్కువగానే ఉన్నాయి. గతేడాది దేశ వ్యాప్త సగటు ధర కిలో ఉల్లి ధర 46 రూపాయలు కాగా, పది రోజుల్లో కిలో ధర 11 రూపాయలు పెరిగి చిల్లర ధర 51 కు పెరిగిందని తెలుస్తోంది. ముందస్తు చర్యగా సెప్టెంబరు 14న కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం నిల్వ చేసిన ఉల్లిని మార్కెట్లోకి విడుదల చేస్తోంది. రాబోయే రోజుల్లో మరింతగా ఉల్లిని విడుదల చేయనుంది. డిసెంబరు 15 వరకు దిగుమతులను సులభతరం చేస్తూ 2003 నాటి ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం సడలించింది.
ధరల స్ధిరీకరణ చర్యల్లో భాగంగా గతేడాది నాఫెడ్ 52 వేల టన్నుల ఉల్లిని మహారాష్ట్ర, గుజరాత్లో కొని నిల్వ చేసింది. ఆగస్టులో బహిరంగ మార్కెట్లో కిలో 40 రూపాయలు దాటినపుడు దానిలో సగాన్ని రాష్ట్రాలకు విక్రయించింది. వర్షాలకు గోదాముల్లో నీరు చేరటంతో సరకు పాడైపోతున్నట్లు గుర్తించి బహిరంగ మా ర్కెట్లో ఎంత వస్తే అంత అన్న ప్రాతిపదికన విక్రయించింది. సరైన నిల్వ ఏర్పాట్లు కూడా చేయలేని నిర్లక్ష్యాన్ని ఈ ఉదంతం వెల్లడించింది. గత ఏడాది కూడా సెప్టెంబరు చివరి వారంలో ఎగుమతులపై నిషేధం విధించింది. నిల్వ పరిమితులను అనుసరంచిన చిల్లర వ్యాపారులకు వంద నుంచి ఇరవై క్వింటాళ్లు, హోల్సేలర్స్కు 500 నుంచి 250 కి తగ్గించినప్పటికీ ధరలు తగ్గలేదు. గత ఏడాది నవంబరు, డిసెంబరు మాసాల్లో కిలో ఉల్లి ధర 150 రూపాయల వరకు పలికింది.
ప్రపంచంలో ఉల్లిసాగు విస్తీర్ణం మన దేశంలో ఎక్కువగా ఉన్నప్పటికీ, దిగుబడి ఎక్కువగా ఉంది. అయితే చైనా తక్కువ విస్తీర్ణంలోనే ఉల్లిని అధికంగా ఉత్పత్తి చేస్తూ, మొదటి స్ధానం ఆక్రమించింది. మూడవ స్ధానంలో ఒక ఏడాది అమెరికా ఉంటే... మరో ఏడాది ఈజిప్టు ఉంటోంది. భారత్, చైనా రెండూ కూడా సాధారణ పరిస్ధితిలో అవసరానికి మించి ఎక్కువ ఉల్లిని ఉత్పత్తి చేస్తున్నాయి. భారత్ ఇక్కడ పండే ఉల్లిలో పది శాతం ఎగుమతులు చేస్తోంది. ధరలు పెరిగినపుడు ఎగుమతులు నిషేధిస్తారు. గత నాలుగు దశాబ్దాలుగా తరచూ ఉల్లి రాజకీయాలు తలెత్తుతున్నాయి. 1980 లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ నేత ఇందిరా గాంధీ ఉల్లిని ఎన్నికల నినాదంగా ముందుకు తెచ్చారు. తరువాత కూడా ఎన్నికల సమయాల్లో ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిం ది. 1998 లో ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఉల్లి ధరల కారణంగానే ఓడిపోయిందనే విశ్లేషిణ వినిపిస్తుంటుంది. దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వారికి ఉల్లి ధరలు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
ఏది ఏమైనా చిత్తసుద్దితో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే నాయకుడే లేడా లేక ఈ సమస్యకి అసలు పరిష్కారమే లేదా అనేది మీరే చెప్పండి..
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments