మొదటి భాగం లో షణ్ముగం ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏమేం చేశాడు అనే విషయాలు తెలుసుకున్నాం, ఇప్పుడు ఆయన పదవీకాలం అయిపోయాక ఏం జరిగిందో తెలుసుకుందాం..
ఖాళీ అయిన ప్రెసిడెంట్ సీటును మహిళలకు కేటాయించడంతో తన భార్యనే ప్రెసిడెంట్గా నిలబెట్టి గెలిపించి, ఇద్దరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు.
ఒక గ్రామపాలనా సంస్థ విండ్మిల్ (గాలిమర) ని ఏర్పాటుచేయడం (2006 లో) దేశంలోనే ప్రథమం. ఒడంతురైకి 140 కి.మీ. దూరంలో మైవాడి అనే ప్రాంతంలో చాలా గాలిమరలున్నాయి.. పలు వ్యాపార సంస్థలు అక్కడ గాలిమరలను ఏర్పాటు చేసుకున్నాయి. షణ్ముగం కూడా తమ గాలిమరను తీసుకెళ్లి అక్కడ పెట్టించారు. అలా చేయడం వల్ల ప్రత్యేకంగా దాని నిర్వహణ ఖర్చు తప్పింది. ఒక్కో గాలిమర నుంచి తయారైన విద్యుత్తు రాష్ట్ర విద్యుత్తు శాఖ గ్రిడ్కి చేరుతుంది. దాని ధర సంబంధిత యజమాని ఖాతాలో జమవుతుంది. 350 కిలోవాట్ల సామర్థ్యం గల ఈ విద్యుత్తు ప్లాంట్ ఏడాదికి ఆరు లక్షల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అందులో రెండు లక్షల యూనిట్లను రాష్ట్ర విద్యుత్ బోర్డుకు అమ్ముతారు. దానికి పెట్టుబడి కోటిన్నర పైనే అయింది. నలభై లక్షలు పంచాయతీ దాచుకున్న సొమ్ము. మిగతాది బ్యాంకు నుంచి లోను తీసుకున్నారు. 2013లో ఆ లోను కూడా తీరిపోయింది. ఇప్పుడు విద్యుత్తు అమ్మడం వల్ల పంచాయతీకి ఏటా దాదాపు 20 లక్షల వరకూ ఆదాయం వస్తోంది.
ఆదాయం పెరుగుతున్నకొద్దీ ఒక్కో సమస్యా పరిష్కరించుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టించారు షణ్ముగం. పంచాయతీ పరిధిలోని అన్ని పల్లెలకూ పక్కా రోడ్లు వేయించారు. సౌరశక్తితో వెలిగే వీధి దీపాలు పెట్టించారు. వీధులన్నీ ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూశారు. అన్ని ఊళ్లకీ పాఠశాలలు అందుబాటులో ఉండేలా చూశారు. పై చదువులకు పట్టణానికి వెళ్లే పిల్లల కోసం బస్సు సౌకర్యం కల్పించారు. ఒకప్పుడు ఆ పంచాయతీలో నలభై మంది పిల్లలు బడికెళ్తే, ఇప్పుడు 400 మంది వెళ్తున్నారు. గ్రామ పరిసరాల్లో అందుబాటులో ఉండే వనరులను ఉపయోగించి స్వావలంబన సాధించడానికి యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించారు. జామ్, లెదర్ పాలిషింగ్ పౌడర్ తయారీ లాంటి చిన్న పరిశ్రమలు పెట్టుకున్నారు యువకులు. అంతే కాదు, ఆ పంచాయతీ పరిధిలో ఇప్పుడు ఒక్క గుడిసె కూడా లేదు. అన్నీ పక్కా ఇళ్లే!
అక్కడి ప్రజల్లో దాదాపు 90 శాతం తోటల్లో కూలిపనులు చేసేవాళ్లే. తిండి గడవడమే కష్టమైన వారికి స్థలమూ సొంతిల్లూ కలలో మాట. చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవారు. వారికోసం ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అప్పటి ముఖ్యమంత్రి పేదరిక నిర్మూలన పథకం ప్రవేశపెట్టారు. షణ్ముగం వెంటనే దరఖాస్తు చేసి 45 ఇళ్లు మంజూరు చేయించుకుని కట్టించారు. ఆ తర్వాత రెండేళ్లకు మరో 25, మూడేళ్ల తర్వాత 135 అలా గిరిజనుల కోసమే మొత్తం 250 ఇళ్లు నిర్మించి ఇచ్చారు. వినోబాజీ నగర్ అనే మరో పల్లెలో 101 ఇళ్లు కట్టారు. సౌరశక్తిని ఉపయోగించుకునేలా వాటిని కట్టారు... ఒక్క పంచాయతీ పరిధిలో వందకు పైగా పర్యావరణ హిత నివాసాలు కట్టడం ఇక్కడ మాత్రమే జరిగింది. ప్రభుత్వ నియమం ప్రకారం సొంత స్థలం ఉంటేనే ఇళ్ల నిర్మాణానికి నిధులిస్తారు. అందుకని వారందరికీ ముందుగా ప్రభుత్వ భూమిని పట్టాలుగా రాసిచ్చారు లింగమ్మాళ్. ఆ తర్వాత ప్రభుత్వ పథకం సాయంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేశారు. అలా సోలార్ పవర్డ్ గ్రీన్ హౌస్ పథకం కింద పేదలకు దాదాపు వెయ్యి ఇళ్లు కట్టించారు. నీటి పైపులైనుతో పాటు ప్రతి ఇంటికీ సౌరఫలకాన్నీ ఏర్పాటుచేశారు. ఇప్పుడు మొత్తం పంచాయతీ పరిధిలో ఇల్లులేని పేద ఒక్కరు కూడా లేరు. అందరివీ సొంతిళ్లే. అందులో సగానికి పైగా సర్కారు కట్టించినవే. రాష్ట్రంలో అత్యధికంగా గ్రీన్ హౌస్లు కట్టించిన పంచాయతీ - ఒడంతురై.
ఒడంతురై పంచాయతీ పరిధిలో నివసించేవారికి ఎలాంటి అవసరమొచ్చినా వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లరు. వైద్యం, కాన్పులు, దుకాణాల్లో పెట్టుబడి లాంటి పెద్ద అవసరాలే కాదు, ఆఖరికి పిల్లలకు చెవులు కుట్టించడమూ, పుస్తకాలు కొనడమూ కూడా పల్లెల్లో పెద్ద విశేషాలే. అందుకని ఆ అవసరాలన్నిటికీ గ్రామ పంచాయతీలోని సూక్ష్మరుణ నిధి నుంచి అప్పులు ఇస్తారు. గ్రామస్థులు తమ అవసరాన్ని తెలుపుతూ వినతిపత్రం రాసిస్తే చాలు, సాయంత్రానికి డబ్బు చేతికందుతుంది. వారికి డబ్బు అందినప్పుడు నామమాత్రపు వడ్డీతో ఆ అప్పుని చెల్లించేస్తారు. ఒకేసారి కట్టలేనివారు వాయిదాల్లో కడతారు. పెద్ద వ్యాపారాలు చేయాలనుకునేవాళ్లకి బ్యాంకు లోన్లు కూడా గ్రామపంచాయతీ అండగా ఉండి ఇప్పిస్తుంది. పాతికేళ్ల క్రితం 1500 ఉన్న జనాభా ఇప్పుడు పదివేలు అవడానికి కారణం? జరుగుతున్న అభివృద్ధిని చూసి వలసవెళ్లిన వాళ్లంతా తిరిగిరావడమే.
ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం అన్ని పల్లెల పంచాయతీ ప్రెసిడెంట్లనీ సమావేశపరిచింది. ‘ఒడంతురై పంచాయతీకి వెళ్లి చూసి నేర్చుకోండి’ అని పంపించింది. అది మొదలు... గ్రామీణాభివృద్ధి, పునరుత్పాదక ఇంధన వనరులు, విద్యుత్తు, నీటి పారుదల... ఒకటని కాదు ఎన్నో శాఖల అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించారు. కేరళ, కర్ణాటక, సిక్కిం తదితర రాష్ట్రాల నుంచి, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాల నుంచి, ఆఖరికి ప్రపంచబ్యాంకు అధ్యక్షుడితో సహా ఎందరో వచ్చి ఆ గ్రామాన్ని చూసి వెళ్లారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుంటూ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయవచ్చో తెలుసుకున్నారు.
‘అయితే ఇలా వచ్చేవారందరికీ ఊరిని చూపించడానికీ వివరించి చెప్పడానికీ మాకేం అభ్యంతరం లేదు. కానీ అంత సమయం వారికోసం వెచ్చిస్తున్నప్పుడు మాకూ ఏదైనా లాభం ఉండాలిగా. అందుకే అలా వచ్చేవాళ్లు మాకు వెయ్యి రూపాయలు చెల్లించాలని నియమం పెట్టాం. అలా వచ్చిన డబ్బుని సూక్ష్మరుణ నిధికి జమచేస్తున్నాం...’ అని చెబుతారు షణ్ముగం. ‘ఆయనలో మంచి వ్యాపారవేత్త లక్షణాలు ఉన్నాయి. చేసే ప్రతి పనిలో ఎంతో కొంత మిగిలేలా చూసేవారు. అదే మరో కొత్త పథకానికి పెట్టుబడి అయ్యేది’ అంటారు గ్రామస్థులు. ‘ఆయన వేసిన దారిలోనే ముందుకు వెళ్తున్నాం’ అంటారు ప్రస్తుత ప్రెసిడెంట్ తంగవేల్. ఇప్పటికీ ఎక్కడెక్కడి నుంచో షణ్ముగంకి ఆహ్వానాలు అందుతుంటాయి. అంత మార్పు ఎలా తేగలిగారో వచ్చి మాకూ చెప్పమంటారు. ‘స్థానిక సంస్థలు ప్రభుత్వ పథకాలను సరిగ్గా ఉపయోగించుకోవడం ముఖ్యం. నీటి సరఫరాకీ, ఇళ్లు కట్టించడానికీ ఆఖరికి కోటిన్నర ఖర్చుతో విండ్మిల్ పెట్టడానికీ... అన్నిటికీ మేము ప్రభుత్వ పథకాలనే ఆధారం చేసుకున్నాం. గాలీ ఎండా కావలసినంత "ఉచితంగా" దొరుకుతాయి. వాటిని సాధ్యమైనంతగా ఉపయోగించుకోవాలి. అలాగే ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వగలగాలి’... అని చెబుతారాయన.
ఒడంతురై వెళ్లినవాళ్లు ఆ ఇళ్లూ నీళ్లూ కరెంటూ... అన్నీ చూసి ఎంత ముచ్చట పడతారో మరో విషయం చూసి అంతకన్నా ఎక్కువగా ఆశ్చర్యపోతారు.
పంచాయతీ ఆదాయమూ, చేపట్టిన పథకాలూ, ఖర్చుల గురించి ఏకంగా పంచాయతీ కార్యాలయం గోడల మీదే రాసి ఉంటుంది. అది కోట్ల రూపాయల గృహనిర్మాణ పథకం కావచ్చు, జనన మరణ ధ్రువపత్రానికి చెల్లించే వంద రూపాయలు కావచ్చు. ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన ప్రతి సందర్భమూ ఆ గోడల మీదికి ఎక్కాల్సిందే. ఎక్కడా పైసా తేడా రాదు.
నాయకుడికి పారదర్శకత అన్నిటికన్నా ముఖ్యమని షణ్ముగం చెప్పకనే చెప్పారు!
ఇలా ప్రతి ఊరి ప్రెసిడెంట్ పనిచేస్తే భారత దేశం లో ప్రతి పల్లె అభివ్రుద్ది బాటపడుతుంది.. అన్ని పల్లెలూ అభివ్రుద్ది చెందితే దేశ ప్రగతి పరుగులు పెడుతుంది, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగితే ప్రపంచానికే మార్గనిర్దేశకులం అవడం ఖాయం .. అలాకాకుండా అధికారాన్ని సీయం లు తమవద్దే కేంద్రీక్రుతం చేసుకుని అన్నీ తామే చేస్తామంటూ స్థానికి ప్రభుత్వాలను విస్మరించినన్నాళ్ళూ ఏ రాష్ట్రమూ, ఏదేశమూ బాగుపడదు..
దూకుడుమీదున్న బీజేపీ తగ్గేది లేదంటున్న టీంఎసీ పెరుగుతున్న పార్టీ ఫిరాయింపులు డిఫెన్స్లో సీఎం మమతా బెనర్జీ బెంగాల్లో ఏం జరుగుతోంది? బెంగాల్ అసెంబ్లీ ఎన్ని...
గాంధీజీ సినిమాలు చూసేవారా? సినిమాలపై గాంధీ అభిప్రాయం ఏమిటి? జాతిపితపై ఎన్ని సినిమాలొచ్చాయి? మహాత్మాగాంధీ... నాటికీ... నేటికీ.. ఏనాటికీ... మనకు మార్గదర్శ&zw...
0 Comments