కార్తీకంలో ఏమి చేయాలి?
శివకేశవులను ఎలా పూజించాలి?
శారీరక ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు శాస్త్రీయ ఆధారాలు..
అది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఆ మాసమంతా అందరిలోనూ ఆధ్యాత్మిక చింతనే... ప్రతీరోజూ పండుగే. విచ్చలవిడిగా ప్రవర్తించే పంచేద్రియాలను అదుపు చేసేందుకు ఆ మాసం ఉత్తమమైనదని భావిస్తారు. ఆ మాసంలో చేసే ఆచారసహిత కార్యక్రమాలకు ఎంతో మంచి ఫలితాలుంటాయని శాస్త్రీయంగానూ నిరూపితమయ్యింది. మరి అంత మహిమాన్విత మాసం ఏమైవుంటుందని అనుకుంటున్నారా? అదే కార్తీక మాసం.
తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీకమాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం ఇది. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. దీపం జ్యోతి పరబ్రహ్మ.. దీపం జ్యోతి మహేశ్వర, దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యా దీపం నమోస్తుతే’. మహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదని అంటారు. ఈ మాసంలో వ్రతాలు, నోములతోపాటు దీపారాధనకు ప్రాధాన్యం ఎంతో ఉంది. కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణిమ కాబట్టి ఈ మాసాన్ని కార్తీక మాసం అని పిలుస్తారు. ఆశ్వయుజ అమావాస్య మర్నాడు అంటే కార్తీక మాస పాడ్యమి నుంచి కార్తీక అమావాస్య వరకు కార్తీక మాసం ఉంటుంది. సూర్యుడు తుల రాశిలో ఉండగా కార్తీక మాసంలో స్నానం, అర్చనం, వ్రతం, ఆరాధనం, దీపారాధనం, దానం మొదలైనవి నియమ నిష్టలతో ఆచరించిన వారికి అక్షయ సంపదలు, సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని 'ధర్మసింధువు' గ్రంథం చెబుతోంది.. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే! అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. అవే భగినీ హస్తభోజనం, నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో ఆచరిందచే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నదీ స్నానం చేయడం అత్యుత్తమం. నది లేకుంటే దగ్గరలోని జలాశయాలకు, లేదా కనీసం బావి వద్దకు వెళ్లి పవిత్ర స్నానం ఆచరించడం పుణ్యఫలప్రదం. ప్రతి పండుగ పరమార్థం భక్తి చైతన్యాన్ని అందించడంతో పాటు శారీరక ఆరోగ్యం, మానసిక వికాసం కలిగించడమే. శరదృతువులో వచ్చే కార్తీకమాసం ఆధ్యాత్మికతను, జీవనవికాసాన్ని కలిగిస్తుంది. కార్తీకమాసాన్ని శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనదిగా పేర్కొంటారు. కాబట్టి వారిద్దరిలో ఎవరికి పూజలు చేసినా ఇద్దరూ సంతోషిస్తారు.
దేవుని సన్నిధిలో దీపాలు వెలిగించి కార్తీక పురాణం లేదా భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్ర నామావళి వంటి వాటిని పారాయణం చేయాలని పండితులు చెబుతుంటారు. నెలరోజుల పాటు చేపట్టే దీపోత్సవం పుణ్యప్రదంగా భావిస్తారు. ఈ కాలంలో వర్షాలు తగ్గుముఖం పట్టి చలి పెరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా వచ్చే కార్తీక మాసంలో చేసే పూజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీపం చీకట్లను దూరం చేస్తుంది. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని అందిస్తుంది. పూర్వకాలంలో ఇప్పటి మాదిరిగా విద్యుత్తు దీపాలు ఉండేవికాదు. ఆలయాల్లో ప్రత్యేకంగా దీప స్తంభాలను ఏర్పాటు చేసేవారు. నిరంతరంగా దీపాలను వెలిగించేవారు. కార్తీకంలో ఆకాశదీపాలను నువ్వుల నూనెతో వెలిగించడం తప్పనిసరి. దీనివలన సకల సంపదలు సమకూరుతాయని నమ్ముతారు. తులసి చెట్టును వరాలను ఇచ్చే మాతగా, లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కార్తీకంలో ఈ నెల రోజులు తులసికోట వద్ద ఉదయం, సాయంత్రం దీపోత్సవం తప్పనిసరిగా చేస్తుంటారు. పౌర్ణమి రోజున తులసికోటకు ప్రత్యేకంగా అలంకరిస్తారు. తులసి నిరంతరంగా ప్రాణవాయువును అందిస్తుంది. ఇంటి ప్రాంగణంలో ముఖ్యంగా ప్రధాన ద్వారం ఎదురుగా తులసి మొక్కను ఉంచుతారు. ఎలాంటి కాలుష్యపూరిత వాయువులను ఇంటిలోకి రాకుండా తులసి అడ్డుకుంటుంది. జలుబు, దగ్గు, జ్వరం, అలసట వంటి వ్యాధులను తులసి నివారిస్తుంది. రోజూ తులసి ఆకులను తీసుకుంటే అన్ని రకాల రోగాలు దూరం అవుతాయని చెబుతుంటారు..
కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివునికి ఆశుతోషుడు అనే బిరుదు వచ్చింది. విష్ణువును తులసి దళాలు, మల్లె ,కమలం,జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను.... శివునికి బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయని పండితులు చెబుతుంటారు.
ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలా ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ,సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారం రోజైనా నియమనిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతి వృత్తాలు, ఉదాహరణలను బట్టి తెలుసుకోవచ్చు. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించుకుని జ్ఞానమనే జ్యోతిని వెలిగించుకోవలన్నదే ఈ దీపారాధన ఉద్దేశ్యం. ఈ మాసం విశిష్టతను కార్తీక పురాణంలో చెప్పారు. దీపం ప్రాణదీపంగా, జీవనదీపంగా మారుతుంది. వేకువజామున నక్షత్రాలున్న సమయంలో నదీస్నానం చేయడాన్ని దైవస్నానం అంటారు. దీంతో శారీరక దోషాలు తొలగిపోతాయి. ఆవు నెయ్యితో కార్తీక దీపాన్ని వెలిగించడం మంచిది.
కార్తీక మాసంలో ముఖ్యమైన వారం సోమవారం. ఈ రోజు శివునికి అత్యంత ప్రీతికరం. ఆ రోజున వేకువజామునే లేచి స్నానాధికాలు ముగించుకుని శివాలయానికి వెళ్లి దీపారాధన చేసి పగలంతా ఉపవాసం ఉండాలి. సాయంత్ర సమయంలో నమకం, చమకం. పురుష, శ్రీ సూక్తాదులతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయాలి. నక్షత్ర దర్శనం తర్వాత శివాలయంలో శివుడిని దర్శించుకోవాలి. ఈ మాసంలో యథాశక్తిగా పేదలకు అన్నదానం చేయడం పుణ్య ఫలదాయకం. కార్తీక సోమవారాల్లో భగవత్ ప్రీతిగా చేసిన స్నానం, దానాలు, జపాలు, అభిషేకాల వల్ల వేల కొలదీ అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు.
కార్తీక మాసంలో చేయవలసినవి...
శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో ఉపవాసానికి ప్రత్యేక స్థానం ఉంది. చాలామంది ఏక భుక్తంగా ఉంటారు. ఇలా ఉండలేనివారు సాయం సమయంలో భోజనం చేస్తారు. మాసం మొత్తంలో ఇలా ఉండలేనివారు కార్తీక సోమవారం, పూర్ణిమ తిథినాడు ఉపవాసం ఉండవచ్చు.
ఈ మాసంలో సాయం సమయాన శివాలయంలో భక్తితో గోపుర ద్వారం వద్ద, శిఖరం మీద, శివలింగం ముందు ఆవు నేతితో దీపారాధన చేసినవారు ధన్యులవుతారు.
దీపదానం విశేష ఫలాన్నిస్తుంది. పలు జాతుల చెట్లతో ఉన్న తోటలో ఉసిరిక చెట్టు కింద సాలగ్రామం ఉంచి హరిచందన పుష్పాలతో పూజ చేసి, ఆ తోటలో భుజించాలి.
కార్తీక మాసంలో కమలాక్షుడైన శ్రీహరిని కమలాలతో పూజించేవారింట కమలవాసిని అయిన శ్రీ మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది. శ్రీహరిని తులసీదళాలతో, జాజి పూలతో పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. మారేడు దళాలతో లక్ష బిల్వార్చన పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తినిస్తుంది.
తులసికోట ముందు గోమయంతో అలికి శంఖం- పద్మం- స్వస్తికం మొదలైన ముగ్గులు పెట్టినప్పుడు తులసీమాత అనుగ్రహం లభిస్తుంది.
ఇదీ కార్తీకమాసం విశిష్టత.. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...
0 Comments